వీడియోకాన్ ఎఫెక్ట్: ఐసీఐసీఐకి తొలిసారి భారీ నష్టాలు, వందకోట్లకుపైనే..!
ముంబై: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకి తొలిసారి భారీ షాక్ తగిలింది. వీడియోకాన్ లోన్ వివాదం నేపథ్యంలో తొలి క్వార్టర్ ఫలితాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ భారీ నష్టాలను నమోదు చేసింది. శుక్రవారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో ఏకంగా బ్యాంక్ రూ.119.55 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది.
కనీసం ఏ మాత్రం లాభాలు లేకుండా.. నష్టాల్లో కూరుకుపోవడం బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1998లో ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. గత సంవత్సరం ఇదే క్వార్టర్లో బ్యాంక్ లాభాలు రూ.2,049 కోట్లగా ఉన్నాయి. బ్యాంక్ ప్రొవిజన్లు ఏడాది ఏడాదికి రెండింతలు పైగా పెరిగాయి.
క్వార్టర్ రివ్యూలో ప్రొవిజన్లు రూ.128.86 శాతం పెరిగి రూ.5,971 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. క్వార్టర్ క్వార్టర్కు మాత్రం ఈ ప్రొవిజన్లు 10 శాతం తగ్గాయి. అయితే బ్యాంక్ కేవలం లాభాలను మాత్రమే పోగొట్టుకుంటుందని, లాభాలను 31 శాతం తగ్గించుకుని రూ.1422 కోట్ల నికర లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. వీరి అంచనాలన్నింటిన్నీ ఐసీఐసీఐ బ్యాంక్ తలకిందులు చేస్తూ ఏకంగా వంద కోట్లకుపైగా నష్టాలను చవిచూసింది.
అయితే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు తగ్గడంతో, ఆస్తుల నాణ్యత మెరుగుపడింది.2018 మార్చితో ముగిసిన క్వార్టర్లో బ్యాంక్ ఎన్పీఏలు 8.84 శాతం నుంచి 8.81 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 4.77 శాతం నుంచి 4.19 శాతానికి పడిపోయాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 9.16 శాతం పెరిగి రూ.6,102 కోట్లు పెరిగినట్టు తెలిసింది. కాగా, వీడియోకాన్ లోన్ వ్యవహారంలో విచారణ జరుగుతుండటంతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఐఓ అండ్ ఎండీ చందా కొచ్చర్ సెలవులో ఉన్నారు. ప్రస్తుతం బ్యాంక్ సీఈఓగా సందీప్ భక్షి కొనసాగుతున్నారు.