ఆన్లైన్ మార్కెట్లోకి పతంజలి.. దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు!
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్కి చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి మంగళవారం లాంఛనంగా తన ఈ కామర్స్ ఆపరేషన్స్ ప్రారంభించింది. హరిద్వార్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పతంజలి తాజాగా ఆన్లైన్ మార్కెట్పై మరింతగా దృష్టి పెడుతోంది.
సంస్థకు ఇప్పటికే పతంజలి ఆయుర్వేద్ డాట్ నెట్ పేరిట సొంత వెబ్ పోర్టల్ ఉన్నప్పటికీ.. మరిన్ని ఈ-కామర్స్ సంస్థలతో చేతులు కలపడం ద్వారా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు సంస్థ శ్రీకారం చుట్టింది.
8 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు...
తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద్ 8 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. స్వదేశీ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాల కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, బిగ్బాస్కెట్, గ్రోఫర్స్, షాప్క్లూస్, స్నాప్డీల్, 1ఎంజీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే సొంత వెబ్ పోర్టల్ పతంజలి ఆయుర్వేద్ డాట్ నెట్ పై అమ్మకాలు సాగిస్తున్న పతంజలి ఇప్పుడు తాజా భాగస్వామ్యాలతో మరింతగా విస్తరించాలని భావిస్తోంది.
ఇక ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా పతంజలి ఉత్పత్తులు...
ఆన్లైన్లో భారీగా విస్తరించే దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో త్వరలో జట్టు కట్టనున్నట్లు పతంజలి ప్రతినిధి ఎస్.కె.తిజారావాలా ఇటీవలే ట్విటర్లో ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక పతంజలి ఉత్పత్తులు అనేక ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా లభ్యం కాగలవని, కంపెనీ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త భాగస్వామ్యాలతో తమ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రాగలవన్నారు.
హరిద్వార్ నుంచి ప్రతి ఇంటి గడపకు...
ముందుగా పేర్కొన్న విధంగానే పతంజలి ఆయుర్వేద్ మంగళవారం పలు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక నుంచి పతంజలి ఉత్పత్తులు ఆన్లైన్ ద్వారా ‘హరిద్వార్ నుంచి ప్రతి ఇంటి గడపకు' చేరతాయని పేర్కొంది. సొంత ఆన్లైన్ వెబ్సైట్ పతంజలి ఆయుర్వేద్ డాట్ నెట్ కు ఇప్పటికే మంచి స్పందన వస్తోందని, డిసెంబరు నెల నాటికే రూ.10 కోట్ల అమ్మకాలు దాటిందని తెలిపింది. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను పతంజలి టర్నోవర్ రూ.10,500 కోట్లను దాటిందని, వచ్చే అర్థిక సంవత్సరంలో రెండు రెట్లు టర్నోవర్ సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు పతంజలి ఆయుర్వేద్ రచిస్తోంది.
మరింత మందికి చేరువగా: ఆచార్య బాలకృష్ణ
పతంజలి ఉత్పత్తులు మరింత మంది వినియోగదారులను చేరేందుకు ఈ ఆన్లైన్ భాగస్వామ్యాలు ఉపయోగపడతాయని పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటి వరకు పతంజలి ఉత్పత్తులు లభ్యంకాని ప్రాంతాల్లోని ప్రజలకు ఇకనుంచి ఆన్లైన్ ద్వారా తమ ఉత్పత్తులు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పతంజలికి ఏటా రూ.50 వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఎఫ్ఎంసీజీ రంగంలో ఇదే అత్యధిక సామర్థ్యమని ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు.
కొంగొత్త వ్యూహాలతో గణనీయ వృద్ధి..
బ్రోకింగ్ సంస్థల అంచనాల ప్రకారం.. పతంజలి బ్రాండ్ ఆహారోత్పత్తులు ప్రస్తుతం 26 శాతం కుటుంబాలకు, వ్యక్తిగత సౌందర్య సాధనాల ఉత్పత్తులు 53 శాతం కుటుంబాలకు చేరుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది వంద శాతం వృద్ధి. కార్యకలాపాల విస్తరణ కోసం పతంజలి ఆయుర్వేద సంస్థ కొన్నాళ్లుగా వ్యాపార వ్యూహాలకు మరింత పదును పెడుతూ వస్తోంది. ప్రారంభం నుంచి అనుసరిస్తూ వస్తున్న బ్రాండెడ్ ఫ్రాంచైజీ విధానం నుంచి.. ఎఫ్ఎంజీసీ కంపెనీలు అనుసరించే చానల్ డిస్ట్రిబ్యూషన్ మార్గానికి కూడా మళ్లింది.
ఈ ఏడాది రూ. 20 వేల కోట్ల టర్నోవరు లక్ష్యం...
2020 నాటికల్లా రూ. 1 లక్ష కోట్ల వార్షిక అమ్మకాలు సాధించాలని పతంజలి నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2019 నాటికల్లా పంపిణీదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 5,000 నుంచి 25,000కు పెంచుకోవాలని భావిస్తోంది. అలాగే, కొత్తగా కుదుర్చుకున్న ఆన్లైన్ వ్యాపార భాగస్వామ్యాలు సైతం పతంజలి వ్యాపార వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ రంగంలో ఏడో స్థానంలో ఉన్న పతంజలి.. తాజా వ్యూహాలతో మరింత భారీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు.. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 20,000 కోట్ల టర్నోవరు లక్ష్యాన్ని సాధించేందుకు అడుగులేస్తోంది.
అద్భుతమైన షాపింగ్ అనుభూతి...
పతంజలి సంస్థతో భాగస్వామ్యంపై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కేటగిరీ మేనేజ్మెంట్) మనీష్ తివారీ మాట్లాడుతూ... ‘పతంజలితో భాగస్వామ్యం మమ్మల్నెంతో థ్రిల్కు గురిచేస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా పతంజలి ఉత్పత్తులు ఇకపై మరింత సులువుగా వినియోగదారులకు లభ్యమవుతాయి. శరవేగంగా వృద్ధి చెందుతోన్న దేశీయ బ్రాండ్స్ తో కలిసి పనిచేయడం ఎంతో ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా మా వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాం..' అని వ్యాఖ్యానించారు.
ఉత్తమమైన ధరకు నాణ్యమైన ఉత్పత్తులు...
పతంజలి ఒక్క ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల విభాగంలోనే కాకుండా విద్య, ఆరోగ్యం తదితర ఇతరత్రా రంగాలపై కూడా దృష్టి సారిస్తోంది. అంతేకాదు, సౌరశక్తి పరికరాల తయారీలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు డిసెంబరు నెలలో ఈ సంస్థ ప్రకటించింది. మరోవైపు పతంజలి ఆయుర్వేద్తో భాగస్వామ్యంపై ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తమ భాగస్వామ్యం వల్ల వినియోగదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని, ఉత్తమమైన ధరకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడంలో రెండు సంస్థలూ కృషి చేస్తాయని వ్యాఖ్యానించారు.