మోసం గుర్తించినా.. స్పందించలేదు: యూనియన్ బ్యాంక్కు రూ.కోటి జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. యూనియన్ బ్యాంక్లో జరిగిన మోసాన్ని సరైన సమయంలో గుర్తించి, నివేదిక పంపనందుకు గానూ రూ.కోటి జరిమానా వేసింది. ఈ మేరకు రెగ్యూలేటరీ ఫైలింగ్ సందర్భంగా యూనియన్ బ్యాంక్ వెల్లడించింది.
బ్యాంకులో జరిగిన మోసాన్ని గుర్తించి, నివేదిక పంపడంలో ఆలస్యం అయినందుకు గానూ రిజర్వ్ బ్యాంక్ రూ. కోటి జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంకుల నియంత్రణ చట్టం కింద ఆర్బీఐకి ఉన్న విశేషాధికారాలతో ఈ జరిమానా వేసిందని యూనియన్ బ్యాంక్ తెలిపింది.
యూనియన్ బ్యాంక్కు ఎందుకు జరిమానా వేయకూడదో చెప్పాలంటూ ఈ ఏడాది జనవరిలో రిజర్వ్ బ్యాంక్ షోకాజు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు బ్యాంక్ స్పందించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ముందు విచారణ కూడా ఇచ్చింది.
అయితే, బ్యాంక్ సమాధానం అసంపూర్ణంగా ఉందని చెబుతూ రూ.కోటి జరిమానా విధించిందని యూనియన్ బ్యాంక్ తెలిపింది. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని యూనియన్ బ్యాంక్ పేర్కొంది.