ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం: బ్యాంకులకు ఆర్కామ్ హామీ, కొత్త పథకంతో తప్పిన టేకోవర్ ప్రమాదం?
ముంబై: అప్పుల కుప్పగా మారిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) ఆ ఊబిలోంచి బయటపడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకులతో చర్చించి తాజాగా ఒక కొత్త ఒప్పందాన్ని తెరమీదికి తీసుకొచ్చింది.
ఆస్తుల విక్రయం ద్వారా రూ.40,000 కోట్లను సేకరించి, ఆ మొత్తం నుంచి బ్యాంకులకు ఉన్న అప్పులను చెల్లిస్తుందనేది కొత్త పథకం. దీంతో 35 దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి పొంచి ఉన్న టేకోవర్ ప్రమాదం నుంచి ఆర్కామ్ తప్పించుకున్నట్లయింది.
ఒక్క చైనా డెవలప్మెంట్ బ్యాంక్కే...
ఈ కొత్త పునరుజ్జీవ పథకానికి చైనా డెవలప్మెంట్ బ్యాంక్ సైతం మద్దతు ఇవ్వనున్నట్లు మంగళవారం కంపెనీ ఛైర్మన్ అనిల్ అంబానీ విలేకరులకు చెప్పారు. 1.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,000 కోట్లు) బకాయిల కోసం ఆర్కామ్ను.. చైనా డెవలప్మెంట్ బ్యాంక్.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)కు లాగింది.
ఆస్తులు అమ్మైనా సరే...
‘ఈ పథకం కింద కంపెనీ వద్ద మిగిలిన స్పెక్ట్రమ్, టవర్లు, స్థిరాస్తి ఆస్తులను విక్రయించనున్నాం.. స్థిరాస్తి ఆస్తుల్లో 125 ఎకరాల ధీరూభాయి అంబానీ నాలెడ్జి సిటీ(డీఏకేసీ) కూడా ఉంది..' అని అనిల్ అంబానీ తెలిపారు. డీఏకేసీ అనేది అనిల్ అంబానీ గ్రూపు కార్యకలాపాల ప్రధాన కార్యాలయం. మరోవైపు, వ్యూహాత్మక పెట్టుబడిదారుకు మైనారిటీ వాటాను విక్రయించే అవకాశమూ ఉందని ఆయన పేర్కొన్నారు.
గడువుకు రెండ్రోజుల ముందే...
చైనా డెవలప్మెంట్ బ్యాంక్తో బీజింగ్లో ఒక అవగాహనను కుదుర్చుకున్న అనిల్ మంగళవారం తెల్లవారుఝామున భారత్కు వచ్చారు. ప్రస్తుత వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ పథకం(ఎస్డీఆర్) కింద ఆర్కామ్లో బ్యాంకులు మెజారిటీ యాజమాన్యాన్ని పొందడానికి డిసెంబరు 28 వరకు గడువు ఉంది. దానికి రెండు రోజుల ముందే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. రుణాన్ని ఈక్విటీగా మార్చమని.. బ్యాంకులేమీ రుణాన్ని రద్దు చేయవని ఈ సందర్భంగా అనిల్ అంబానీ పేర్కొన్నారు.
రూ.45 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లకు...
నిజానికి ఈ ఏడాది అక్టోబరు నాటికి ఆర్కామ్పై రూ.45,000 కోట్ల రుణ భారం ఉంది. ఈ ఏడాది జూన్లోనే చ్చారు. ప్రస్తుత వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ పథకం(ఎస్డీఆర్)కు ఆర్కామ్ ఒప్పుకుంది. దీని కింద కంపెనీలో బ్యాంకులకు మెజారిటీ వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడగలమని ఆ సమయంలోనే అనిల్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆర్కామ్ సరికొత్త పథకానికి అన్ని బ్యాంకులు ఒప్పుకోవడంతో ఎస్డీఆర్ ప్రమాదం తప్పిపోయింది. తాజాగా కంపెనీ సరికొత్త ప్రతిపాదన అమలు జరిగి, మొత్తం ప్రక్రియ పూర్తయితే అప్పులు రూ.45,000 కోట్ల నుంచి రూ.6000 కోట్లకు తగ్గిపోతాయి.
ఇదీ కొత్త పథకం...
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తుల నగదీకరణ మొత్తం ఎనిమిది దశల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియను ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్.ఎస్. ముంద్రా ఆధ్వర్యంలోని పరిశీలక కమిటీ పర్యవేక్షిస్తుంది. ట్రాయ్ నుంచి కూడా సభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. మొత్తం ప్రక్రియ 40 రోజుల్లో పూర్తి అవుతుంది. 125 ఎకరాల్లోని డీఏకేసీతో పాటు ఇతరత్రా ఆస్తుల విక్రయానికి ఒక ప్రత్యేక సంస్థను నియమిస్తారు. డీఏకేసీ విలువను రూ.25,000 కోట్లుగా హెచ్డీఎఫ్సీ రియాల్టీ ఇప్పటికే లెక్కగట్టింది. దీని అమ్మకం ద్వారా రూ.10,000 కోట్ల మేర రుణాన్ని తగ్గించుకోవచ్చని అనిల్ అంబానీ అభిప్రాయపడ్డారు.
ఎవరా వ్యూహాత్మక పెట్టుబడిదారు?
ఇక వ్యూహాత్మక పెట్టుబడిదారుకు విక్రయించే కంపెనీ వాటా విలువను కానీ.. పెట్టుబడిదారు పేరు కానీ అనిల్ అంబానీ వెల్లడించలేదు. కానీ ఈ ప్రక్రియ ద్వారా వచ్చే డబ్బును బ్యాంకర్ల బృందానికి చెల్లిస్తారు. అందులో చైనా డెవలప్మెంట్ బ్యాంక్కు కూడా ఉంది. ఈ బ్యాంకుతో సోమవారం బీజింగ్లో సెటిల్మెంట్ అవుటాఫ్ కోర్ట్(కోర్టు వెలుపలి ఒప్పందాన్ని) సైతం ఆర్కామ్ కుదుర్చుకుంది. బ్యాంకులు, బాండ్ హోల్డర్లకు రుణానికి బదులుగా ఎటువంటి ఈక్విటీ మార్పిడి ఉండదు. అయితే స్పెక్ట్రమ్ను పాక్షికంగా బదిలీ చేస్తామని అంబానీ తెలిపారు.
పరుగులెత్తిన ఆర్కామ్ షేర్లు....
బ్యాంకులతో ఆర్కామ్ సరికొత్త ఒప్పందం కుదుర్చుకుందనే వార్తల నేపథ్యంలో మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈలో ఒక దశలో 41 శాతం పెరిగి రూ.23కు చేరిన షేరు ధర చివరకు 30.78 శాతం లాభంతో రూ.21.33 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 31.90 శాతం లాభంతో రూ.21.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1388.88 కోట్లు పెరిగి రూ.5898.88 కోట్లకు చేరింది.