అప్పుల తిప్పలు: రిలయన్స్ జియోకు రూ.2000కోట్ల ఆస్తుల అమ్మిన ఆర్కామ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు మీడియా కన్వర్జెన్స్ నోడ్స్(ఎంసీఎన్)ను అమ్మేసిసినట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) వెల్లడించింది. ఈ అమ్మకం ప్రక్రియ పూర్తయిపోయిందని తెలిపింది.
అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ సంస్థ 248 నోడ్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు కలిపి దాదాపు మొత్తం రూ.2000కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మేసినట్లు తెలిపింది.
5మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతాన్ని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగించనున్నారు. అన్నీ జియోకు బదిలీ చేసినట్లు ఆర్కామ్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, ఇంకా రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులను కూడా ఆర్కామ్ అమ్మనున్నట్లు సమాచారం.
గత సంవత్సరం అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్.. రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.46,000కోట్ల రుణభారాన్ని తగ్గించేందుకు ఆర్కామ్ వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను జియోకు అమ్మేసేందుకు అంగీకరించింది.
ఈ క్రమంలో 2017 డిసెంబర్లో డీల్ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్, 248 మీడియా కన్వర్జెన్స్ నోడ్స్ అమ్మకం ఈ ఒప్పందంలో ఉంది. ఈ నేపథ్యంలో గురువారం రోజున ఈ డీల్ పూర్తయింది. కాగా, ఈ డీల్తో మార్కెట్లో ఆర్కామ్ షేర్ విలువ 1.97శాతం మేర పెరిగి రూ.19.15 వద్ద కొనసాగుతోంది.