వారం వ్యవధిలోనే రెండింతలైన ఆర్కామ్ షేరు! అనిల్ అంబానీ ప్రకటనే కారణమా?
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేరు గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్లో పరుగులు తీస్తోంది. ఎందుకని? ఈ ప్రశ్న ఇన్వెస్టర్లకు కచ్చితంగా ఎదురవుతుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ అన్నది అనిల్ అంబానీ గ్రూపులో భాగమైన ఒక కంపెనీ.
15 ఏళ్ల పాటు సెల్యులర్ సేవలు అందించిన ఈ సంస్థ గత నెలలోనే దుకాణం మూసేసింది. కారణం అప్పులు. టెలికం నిర్వహణపై ఏటా వేలాది కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయి. దీంతో ఆ నష్టాలకు బ్రేక్ వేసేందుకు సేవలు నిలిపివేసింది కంపెనీ. ప్రస్తుతం ఆర్కామ్ అప్పులు రూ.45,000 కోట్లకు పెరిగిపోయాయి.
ఇక, రుణాలు తీర్చలేక దివాలా చర్యలకు వెళ్లాల్సి వస్తుందన్న అంచనాలతో షేర్లకు అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఈ ఏడాది నవంబర్ 15న ఆర్కామ్ షేరు రూ.9.60కు క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి.
ఈ రోజు అంటే.. గురువారం ఈ షేరు రూ.33.36 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే ఇది రెట్టింపైంది. ఈనెల 22న రూ.16.38 వద్ద ఉందీ షేరు. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చనున్నట్టు అనిల్ అంబానీ చేసిన ప్రకటనతో ఆర్కామ్ షేరు తిరిగి పుంజుకుంది.
అయినా సరే, విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే... కంపెనీ రుణ భారం కారణంగా ఇటీవలి కాలంలో ఈ షేరు ధర బాగా తగ్గినందున, తిరిగి రకవరీ అవుతోందని, సమీప కాలంలో మరికొంత పెరగొచ్చని.
అయితే రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్థిక మూలాలు సరిగా లేనందున మళ్లీ ఈ కంపెనీ షేరు పడిపోదన్న గ్యారెంటీ లేదని, కాబట్టి పెరిగిన ఈ స్థాయిలో తమ దగ్గరున్న షేర్లను విక్రయించేసి బయటపడడం మంచిదని చెబుతున్నారు.