వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గరళకంఠుడ్ని అవుతా, విషం తాగడానికి సిద్ధం: ఉర్జిత్ పటేల్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: బ్యాంకింగ్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నదని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులపై మాదిరిగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. 'వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నీలకంఠుడిలా విషం తాగడానికి ఆర్బీఐ సిద్ధం. విమర్శలకూ వెరవం. ప్రతిసారి మెరుగైన పరిష్కారానికీ ప్రయత్నిస్తాం'అని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనకు గరళకంఠుడిగా మారుతానని, విషం సేవించడానికైనా సిద్ధపడుతానని ఆయన అన్నారు.

గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉర్జిత్ పటేల్ తొలిసారి రూ.12,967 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంపై నోరు విప్పారు. 'బ్యాంకింగ్‌ రంగంలోని మోసాలు, అవకతవకలపై ఆర్బీఐలో ఉన్న మాకు కూడా కోపం, బాధ, నొప్పి ఉన్నాయి.మరీ సరళంగా చెప్పాలంటే కొంత మంది వ్యాపారవేత్తలు కొంత మంది బ్యాంకర్లతో కలిసి మన దేశ భవిష్యత్‌ను దోచుకుంటున్నారు' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మోసాల నివారణకు చర్యలు తీసుకుంటామన్న ఉర్జిత్ పటేల్

మోసాల నివారణకు చర్యలు తీసుకుంటామన్న ఉర్జిత్ పటేల్

‘బ్యాంకుల్లో ఆస్తుల నాణ్యత సమీక్షను తీసుకొచ్చాం. ప్రస్తుతం మేం బాగా పనిచేస్తున్నాం. ఇలాంటి మోసాలు జరగకుండా చూస్తాం. ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థను అమృత మధనంగా భావిస్తే అందులో మంధర పర్వతం పాత్రను ఆర్బీఐ పోషిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఆర్బీఐ కట్టుబడి ఉంది. మధనం పూర్తయ్యే వరకు దేశ భవిష్యత్‌ కోసం నీలకంఠుడిలా విషం తాగడానికి సైతం ఆర్బీఐ సిద్ధంగా ఉంది. కాకపోతే ఈ విషయంలో ప్రమోటర్లు, బ్యాంకులు, వ్యక్తిగతంగా, సమూహంగా (పారిశ్రామిక సంఘాలతో కలిసి) రాక్షసుల వైపు కాక.. దేవతల వైపు నిలబడాలని కోరుతున్నా' అని ఉర్జిత్ పటేల్ ఉద్వేగ భరితంగా ప్రతిస్పందించారు.

అన్ని బ్యాంకుల్లో మోసాలను గుర్తించలేమన్న ఉర్జిత్ పటేల్

అన్ని బ్యాంకుల్లో మోసాలను గుర్తించలేమన్న ఉర్జిత్ పటేల్

ఏ బ్యాంకింగ్‌ నియంత్రణ వ్యవస్థైనా అన్ని మోసాలను ముందే గుర్తించలేదని, అరికట్టలేదని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. మోసం జరిగే ప్రతీ చోటా ఆర్బీఐ ఉండి వాటిని నివారించలేదని, అది అసాధ్యం అని పేర్కొన్నారు. కార్యకలాపాల్లో ఉండే లోపాల ద్వారా పీఎన్బీ మోసం జరిగిందని అర్థం అవుతోందన్నారు. అయితే ఆర్‌బీఐ 2016లోనే మూడు సర్క్యులర్‌ల ద్వారా ఆ లోపాలను తొలగించడానికి బ్యాంకులకు దిశానిర్దేశం చేసినా బ్యాంకులు అలా చేయలేదని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో అంతర్గత ప్రక్రియలు విఫలమయ్యాయని ఇక్కడ స్పష్టమవుతోందని, అందుకే పీఎన్బీ కేసులో ఆర్బీఐ బాధ్యత వహించలేదని ఉర్జిత్ పటేల్ తెలిపారు.

మూలాలపై ద్రుష్టి సారిస్తే మొండి బాకీల పరిష్కారం

మూలాలపై ద్రుష్టి సారిస్తే మొండి బాకీల పరిష్కారం

మొండి బకాయిల వసూళ్లపై తక్షణం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లలో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల మొండి బకాయిల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రమోటర్‌-బ్యాంకుల మధ్య ఉన్న రుణ బంధంలోనే వీటి మూలాలు ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టాలి'' అని అన్నారు. నిబంధనల మేరకు వసూలు కాని రుణాలను మొండి బకాయిలుగా గుర్తించకపోవడంపై చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.

 ప్రస్తుత వ్యవస్థతో మోసాలను అరికట్టలేమన్న ఆర్బీఐ

ప్రస్తుత వ్యవస్థతో మోసాలను అరికట్టలేమన్న ఆర్బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఆర్బీఐకి మరిన్ని అధికారాలు అవసరం అని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. ప్రస్తుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వ్యవస్థ ద్వారా మోసపూరిత కార్యకలాపాల ద్వారా లాభాలు పొందకుండా మోసపూరిత వ్యక్తులను అదుపులో పెట్టడానికి వీలు కలగడం లేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల డైరెక్టర్లు, యాజమాన్యాన్ని తొలగించడానికి ఆర్బీఐకి అధికారాలు లేవని గుర్తు చేశారు.

పీఎస్బీల్లో నియంత్రణ తక్కువేనని ఆర్బీఐ అంగీకారం

పీఎస్బీల్లో నియంత్రణ తక్కువేనని ఆర్బీఐ అంగీకారం

బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలో మార్పుల ద్వారా మన బ్యాంకింగ్‌ నియంత్రణ అధికారాలను పెంచాలని ఉర్జిత్ పటేల్ చెప్పారు. గత అయిదేళ్లలో చూస్తే కేవలం కొన్ని కేసులు(బ్యాంకింగ్‌ మోసాలకు సంబంధించి) మాత్రమే పూర్తయ్యాయని, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మార్కెట్‌ క్రమశిక్షణ వ్యవస్థ బలహీనంగా ఉందని మనం ఒప్పుకోవాలని ఉర్జిత్ పటేల్ చెప్పారు. అందుకే ఈ బ్యాంకుల్లో బలమైన నియంత్రణ అధికారాలు అవసరమని, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టంలోని కొన్ని నిబంధనల వల్ల అవకతవకలపై సరైన చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పారు.

 80:20 గోల్డ్ స్కీమ్ పై మౌనం వీడిన ఆర్బీఐ మాజీ గవర్నర్

80:20 గోల్డ్ స్కీమ్ పై మౌనం వీడిన ఆర్బీఐ మాజీ గవర్నర్

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో జరిగిన రూ.13,600 కోట్ల కుంభకోణంపై నిందించాల్సింది ఇంకా చాలా ఉన్నదని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. 2013 నుంచి 2016 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రాజన్ 2014లో ప్రారంభించిన 80:20 గోల్డ్ స్కీమ్‌పై ఆరోపణలు రావడంతో ఈ కుంభకోణంపై మౌనాన్ని వీడారు.

యూపీఏ సన్నిహితుల కోసమే నిబంధనలు మార్చారని ఆరోపణలు

యూపీఏ సన్నిహితుల కోసమే నిబంధనలు మార్చారని ఆరోపణలు

యూపీఏ-2 ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు 80:20 గోల్డ్ స్కీమ్ విధానాన్ని మార్చి తమ సన్నిహితులకు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయోజనాన్ని కల్పించిందని ఆరోపిస్తూ 2014 జూలై 26వ తేదీన ఐబీజేఏ (ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్) రాసిన లేఖ ఇప్పుడు తెరమీదికి రావడంతో ఆయన ఈ కుంభకోణంపై స్పందించారు.

లోపాలను పరిశీలిస్తే అసలు సంగతి బయట పడుతుంది

లోపాలను పరిశీలిస్తే అసలు సంగతి బయట పడుతుంది

80:20 గోల్డ్ స్కీమ్‌పై రఘురాం రాజన్ స్పందిస్తూ ‘ఎటువంటి విధాన నిర్ణయంతోనైనా కొన్ని సానుకూల ఫలితాలు, మరికొన్ని ప్రతికూల ఫలితాలు వస్తాయి. పీఎన్బీ కుంభకోణంపై నిందించాల్సింది ఇంకా చాలా ఉన్నది. ఈ కుంభకోణం ఎలా జరిగిందో, లోపాలు ఎక్కడ తలెత్తాయో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అసలు పీఎన్బీ డైరెక్టర్లను ఎవరు నియమించారో, ఈ కుంభకోణానికి ద్వారాలు తెరిచింది ఎవరో మనం ప్రశ్నించాలి' అని ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పేర్కొన్నారు.

క్రిప్టో కరెన్సీల కొనుగోలుపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిషేధం

క్రిప్టో కరెన్సీల కొనుగోలుపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిషేధం

తమ డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డులతో బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ లావాదేవీలు జరగకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిషేధించింది. క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత లేదని ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. సంబంధిత విక్రయదార్ల వద్ద, ఆన్‌లైన్‌లో అయినా క్రిప్టోకరెన్సీల లావాదేవీలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులు పనిచేయవు.

ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తగా జనవరిలో పాల్ రోమర్ రాజీనామా

ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తగా జనవరిలో పాల్ రోమర్ రాజీనామా

ప్రపంచ బ్యాంకు తదుపరి ముఖ్య ఆర్థికవేత్తగా భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అయిన అరవింద్‌ సుబ్రమణియన్‌ను నియమించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత జనవరిలో రాజీనామా చేసిన పాల్‌ రోమర్‌ స్థానంలో వచ్చే నెల మొదట్లో ఈ నియామకం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌), ప్రపంచ బ్యాంకు మధ్య వచ్చేనెలలో జరిగే సమావేశాల సందర్భంగా సుబ్రమణియన్‌తో భేటీ అనంతరం ప్రపంచ బ్యాంకు ఆ మేరకు నియమించే అవకాశం ఉంది'అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌ 20-22 మధ్య వాషింగ్టన్‌‌లో ఆ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ఊహాజనిత వార్తలపై స్పందించలేమని ప్రపంచ బ్యాంకు ఒక ఈ - మెయిల్‌ సమాధానంలో తెలిపింది.

English summary
GANDHINAGAR: Expressing deep anguish over a spate of banking frauds, RBI Governor Urjit Patel said on Wednesday that like the 'Neelakantha', the central bank will consume poison and face brickbats, but will persist with endeavour to become better with each trial.Breaking silence over the Rs 12,967 crore scam at PNB, he said: "I have chosen to speak today to convey that we at the Reserve Bank of India also feel the anger, hurt and pain at the banking sector frauds and irregularities."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X