నోట్లరద్దు, జీఎస్టీ నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్న ఐఎంఎఫ్
వాషింగ్టన్: భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఇప్పుడిప్పుడే కోలుకొంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొన్నది. పెద్ద నోట్ల రద్దుకు తోడు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో కొంతకాలంగా భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందని ఐఎంఎఫ్ తాజా అంచనాలో పేర్కొన్నది.
ఇప్పుడిప్పుడే జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతోందని ఐఎంఎఫ్ వివరించింది. విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సంస్కరణలకు ప్రాధాన్యం తగ్గిందని, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.
నిలదొక్కుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఐఎంఎఫ్
డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 7.2 శాతం చూస్తుంటే, వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అనే పేరు నిలబెట్టుకుందని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టో జాంగ్ అన్నారు. ‘ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో సంస్కరణలు తేవడం, ప్రైవేట్, ప్రభుత్వ రంగ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే సంపన్న దేశాల్లోని ఆదాయ స్థాయిని భారత్ కూడా అందుకుంటుంది' అని టో జాంగ్ అంచనా వేశారు.
భారతదేశంలో క్రమంగా పెరుగుతున్న నగదు లావాదేవీలు
సోమవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టో జాంగ్ భారత్, భూటాన్లలో పర్యటించనున్నారు. సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ)లో ‘ఫైనాన్షియల్ టెక్నాలజీ' అనే అంశంపై జాంగ్ మాట్లాడనున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీలతో తాత్కాలికంగా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా పడుతుందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రోజూ నగదు లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయని టో జాంగ్ తెలిపారు.
మొండి బకాయిలను తగ్గింపుకు రీ క్యాపిటలైజేషన్ మార్గం కావాలి
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం (రీక్యాపిటలైజేషన్) అనేది ఆర్థిక సంస్కరణల్లో భాగమై, మొండి బకాయిలను (ఎన్పీఏలు) భారీగా తగ్గించుకునేందుకు తోడ్పడేలా ఉండాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టో జాంగ్ అన్నారు. నీరవ్ మోదీ కేసు నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్పీఏల వైపు మళ్లిందన్నారు. ఇటీవలి విధాన సంస్కరణలు బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల్లో ప్రమాదాల పరిష్కారానికి చాలా ముఖ్యమైనవని టో జాంగ్ తెలిపారు.
బ్యాంకుల సామర్థ్యం పెంపునకు దోహదపడుతుందని వ్యాఖ్య
‘ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వాటి బలోపేతానికి, రుణ సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది' అని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టో జాంగ్ అన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి చివరినాటికి దేశీయ బ్యాంకింగ్ రంగ మొండిబకాయిలు రూ.9.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఈ మధ్య అసోచామ్-క్రిసిల్ సంయుక్త నివేదిక అంచనా వేసింది.
మొండి బాకీల వేలానికి సిద్ధమైన ఎస్బీఐ, యూకో బ్యాంకు
రూ.1,245 కోట్ల విలువైన మొండి బకాయిల (ఎన్పీఏలు) విక్రయానికి ప్రభుత్వ రంగ బ్యాంక్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యూకో బ్యాంక్లు సిద్ధం అయ్యాయి. వీటిని విక్రయించడానికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, ఎఫ్ఐలను ఎస్బీఐ, యూకో బ్యాంక్లు ఆహ్వానించాయి.
13 మొండి బకాయిల విక్రయానికి యూకో బ్యాంకు నిర్ణయం
ఎస్బీఐ, యూకో బ్యాంకులు విక్రయించనున్న మొండి బకాయిల ఆస్తుల జాబితాలో జెనిత్ బిర్లా (ఇండియా), సోనా అల్లాయ్స్ ఉన్నాయి. ఎస్బీఐకి సోనా అల్లాయ్స్ రూ.647.64 కోట్లు చెల్లించాల్సి ఉండగా, జెనిత్ బిర్లా రూ.139.36 కోట్లు బకాయి పడింది. వీటి కొనుగోలుపై సోమవారం లోగా ఆసక్తి తెలపాల్సిందిగా బిడ్డర్లను ఎస్బీఐ కోరింది. ఇ-బిడ్డింగ్ ప్రక్రియ 23న జరగనుంది. ఇదిలాఉంటే, రూ.457.98 కోట్ల విలువైన 13 ఎన్పీఏలను యూకో బ్యాంక్ విక్రయించనుంది. మంగళవారంలోగా ఆసక్తి తెలిపాలని బిడ్డర్లను యూకో బ్యాంక్ కోరింది.
పీఎన్బీ స్కామ్ను ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చాన్స్గా మార్చుకోవాలి
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్కామ్ ఆర్థిక వ్యవస్థలో భయాందోళనకు, అచేతనానికి దారితీయరాదని ఫిక్కీ సూచించింది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఆర్బీఐ, ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు ఫిక్కీ ప్రెసిడెంట్ రాషేష్ షా తెలిపారు. షా ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు. పీఎన్బీ కుంభకోణం మలి విడత యూపీఏ ప్రభుత్వ హయాంలోని చివరి రోజులను గుర్తు చేస్తోందని, నాడు సీబీఐ, సీవీసీ, కాగ్ అంటే భయం ఉండేదని షా పేర్కొన్నారు. ఈ తరహా స్కామ్ల తో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆయన, 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్ల తర్వాత పరిస్థితిని గుర్తు చేశారు. పీఎన్బీ స్కామ్ను వ్యవస్థల బలోపేతానికి అవకాశంగా మార్చుకోవాలని సూచించారు.
వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: అసోచామ్
పీఎన్బీ స్కామ్తో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు అతిగా స్పందించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రుణాల జారీపై ప్రభావం పడుతుందని అసోచామ్ హెచ్చరించింది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ చర్యలు నష్టాన్ని పరిమితం చేసే విధంగా ఉండాలని సూచించింది. ‘కుంభకోణాలు బయటకు వచ్చాక, మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో హడావిడి సాధారణమే. కానీ, ఇది బ్యాంకుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. కనుక ఎంతో నిగ్రహంతో దీన్ని ఓ అవకాశంగా భావించి వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి' అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు.