నిరుద్యోగులకు జియో శుభవార్త: 80వేల ఉద్యోగాలు, సిఫార్స్తో 15 శాతం మందికి ఛాన్స్
ముంబై: రిలయెన్స్ జియో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 75వేల నుంచి 80వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో 1.57 లక్షల మంది సిబ్బంది ఉన్నారని, ఈ ఏడాది మరో 80వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు జియో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ వెల్లడించారు. కంపెనీ విస్తరణలో భాగంగా బ్రాడ్ బ్యాండ్, పేమెంట్స్ బ్యాంకింగ్, కృత్రిమ మేధ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని తెలిపారు. సాంకేతికత, డిగ్రీ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు.
ఆయన ఎన్హెచ్ఆర్ఎం ఇండియా టెక్ 18 సదస్సులో మాట్లాడారు. టెలికాం సంస్థలు విలీనమైనా, మూతపడినా అందులోను ఉద్యోగులకు ఇబ్బంది ఉండదన్నారు. వారికి చాలా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని తెలిపారు. టెక్నికల్ రూట్లో ఉన్న వారు ఐటీ కంపెనీల్లో, మార్కెటింగ్లో ఉన్నవారు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు చేయవచ్చన్నారు.
డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు బాగా అబివృద్ధి చెందుతోందన్నారు. మన వద్ద ఉద్యోగులు సులభంగా దొరుకుతారని, కానీ సరైన నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం లేదన్నారు. తాము కొత్తగా తీసుకునే వారిలో చాలామంది ఫ్రెషర్స్ ఉంటారని, తమ ఉద్యోగుల సిఫార్స్ ఆధారంగా కూడా 15 శాతం మందిని తీసుకుంటామన్నారు.
తమ సంస్థలో ప్రాథమిక ఉద్యోగం సమయంలో వలసలు 32 శాతంగా ఉన్నాయని, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి జియో ఒక ఆధారంగా ఉందని, ఆ తర్వాత వారి భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్తున్నారని, ఇది మంచి పరిణామం అన్నారు.