ఇదీ రొటోమాక్ కొఠారీ స్పెషల్: రుణం రూ.2919 కోట్లు ప్లస్ వడ్డీతో 3695 కోట్లు!
న్యూఢిల్లీ: పీఎన్బీలో ఎల్వోయూల నయామోసం బయటపడటంతో బ్యాంకులు ఇతర ఎగవేతదారులపై ద్రుష్టి సారించడంతో రొటోమాక్ పెన్స్ యజమాని విక్రం కొఠారీ రుణాల బాగోతం బయట పడింది. తాను రుణ ఎగవేత దారుడ్ని కాదని, చెల్లిస్తానని నమ్మ బలికిన విక్రం కొఠారీపై బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేయడంతో పత్రాలన్నీ వెలికి తీసి చూస్తే ఆ రుణాల మొత్తం పెరిగింది.
రొటోమాక్ సంస్థ అధినేత విక్రం కొఠారీ ఏడు బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీతో కలిపి రూ.3695 కోట్లకు చేరుకున్నదని తేలింది. అయితే తీసుకున్న ఈ రుణాలు ఏం చేశారా? అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు ద్రుష్టి సారించాయి. అంతా సజావుగానే ఉన్నదని నమ్మబలుకుతూనే మరోవైపు ఆ డబ్బును విదేశాలకు తరలించారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు ఇలా
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి వీరిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. సోమవారం కాన్పూర్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. విక్రమ్ కొఠారీతోపాటు ఆయన భార్య సాధనా కొఠారీని, కుమారుడు రాహుల్ కొఠారీని ప్రశ్నించారు. రొటోమాక్ సంస్థ రూ.2,919 కోట్ల రుణాలను దారి మళ్లించి ఏడు బ్యాంకుల కన్సార్షియాన్ని మోసగించిందని, ఈ రుణాలకు వడ్డీ కూడా కలిపితే ఆ ఏడు బ్యాంకులకు ఆ సంస్థ చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.3,695 కోట్ల వరకూ ఉన్నట్లు స్పష్టమవుతున్నదని సీబీఐ పేర్కొన్నది.
వడ్డీతో కలిపి రూ.3695 కోట్లకు చేరుకున్న రొటోమాక్ రుణాలు
ప్రభుత్వ రంగంలోని ఏడు బ్యాంకుల కన్సార్షియాన్ని మోసగించారన్న అభియోగాలతో రొటోమాక్ సంస్థ అధినేత విక్రమ్ కొఠారీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కొంత మంది బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ ఈ సంగతి తెలిపింది. వ్యాపారం కోసం తీసుకున్న రూ.3,695 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా బ్యాంకులను మోసగించారన్న ఆరోపణలతో వారిపై ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. విక్రమ్ కొఠారీతో పాటు ఆయన భార్యను, కుమారుడిని సీబీఐ ప్రశ్నిస్తున్నదని ఆయన చెప్పారు. ‘ఫెమా' నిబంధనల ఉల్లంఘించారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు.
ఏడు బ్యాంకుల కన్సార్టియంకు ఇలా విక్రం కొఠారీ పంగనామాలు
రొటోమాక్ యజమాని విక్రమ్ కొఠారీ, ఆయన కుటుంబ సభ్యులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు దాఖలు చేసింది. రొటోమాక్ సంస్థ రూ.3,695 కోట్ల రుణాలను ఎగ్గొట్టి బ్యాంకులను మోసగించిందన్న అభియోగాలతో సీబీఐ ఆదివారం రాత్రి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పరిశీలించిన తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దాఖలు చేసింది.
రొటొమాక్ రుణాలు మొండి బకాయిలుగా ఇలా రద్దు
రొటోమాక్ సంస్థ చేతిలో మోసపోయిన బ్యాంకుల్లో ఏడు బ్యాంకులు ఉన్నాయి. వాటిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.754 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.457 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.50 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో రూ.771 కోట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.459 కోట్లు, అలహాబాద్ బ్యాంక్లో రూ.330 కోట్లు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో రూ. 97 కోట్ల మేరకు విక్రం కొఠారీ రుణాలు తీసుకున్నారు. ఇందులో కొన్ని బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలు మొండిబకాయిలుగా రద్దు చేసేశాయి కూడా.
నల్లధనం కూడబెట్టేందుకు వినియోగించారా? అని పరిశీలిస్తున్న ఈడీ
ఈ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కొఠారీ కుటుంబ సభ్యులు విదేశాలకు తరలించారా?, ఆక్రమ ఆస్తులను, నల్లధనాన్ని కూడబెట్టేందుకు ఆ సొమ్మును ఉపయోగించారా? అనే అంశాలపై దర్యాప్తు జరుపనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. 1992లో ప్రారంభమైన రొటోమాక్ టర్నోవర్ అంతర్జాతీయంగా 2015లో రూ.9,138 కోట్లు, 2016లో రూ.5,874 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఈ సంస్థ దాదాపుగా హోల్ సేల్ వ్యాపార లావాదేవీలే జరుపుతుంది.
అందుబాటులో ఉంటానని కొఠారీ ఉద్ఘాటన
తాను కుంభకోణానికి పాల్పడలేదని కాదని, మీడియా పేర్కొన్నట్లు తాను ఎక్కడికీ పారిపోలేదని, కాన్పూర్లోనే ఉన్నానని విక్రమ్ కొఠారీ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. తన కంపెనీని బ్యాంకులు మొండి బకాయిగా ప్రకటించినా తాను మాత్రం రుణ ఎగవేతదారుడిని కాదని, ప్రస్తుతం ఈ అంశాన్ని ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మాట నిజమేనని, వాటిని త్వరలో తిరిగి చెల్లిస్తానని, తాను ఎక్కడికీ పారిపోలేదని, నిరంతరం అందుబాటులోనే ఉండి బ్యాంకులకు సహకరిస్తున్నానని కొఠారీ తెలిపారు.