బ్యాంకుల్లో ‘అన్క్లెయిమ్డ్’ సొమ్ము రూ.11,302 కోట్లు
ముంబై: దేశంలోని 64 బ్యాంకుల మూడు కోట్లకు పైగా ఖాతాల్లో రూ.11,302 కోట్ల అన్ క్లెయిమ్డ్ (ఎవరూ తమదని ప్రకటించని) సొమ్ము పడి ఉన్నదని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అత్యధికంగా రూ.1,262 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో రూ.1,250 కోట్లు, ఇతర అన్ని జాతీయ బ్యాంకుల్లో రూ.7,040 కోట్ల అన్క్లెయిమ్డ్ సొమ్ము మూలుగుతున్నది.
19 ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొత్తం రూ.1,416 కోట్ల అన్క్లెయిమ్డ్ సొమ్ము పడి ఉన్నదని, వీటిలో ఐసీఐసీఐ (రూ.476 కోట్లు), కోటక్ మహీంద్రా (రూ.151 కోట్లు) అగ్రస్థానంలో నిలుస్తుందని ఆర్బీఐ పేర్కొన్నది. 25 విదేశీ బ్యాంకుల్లో రూ.332 కోట్ల అన్ క్లెయిమ్డ్ సొమ్ము మూలుగుతున్నదని, వీటిలో ఒక్క హెచ్ఎస్బీసీ బ్యాంకులోనే రూ.105 కోట్ల అన్క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నదని ఆర్బీఐ వివరించింది.
అన్ క్లైమ్డ్ సొమ్ము బినామీ లేదా అప్రకటిత వ్యక్తులది కావచ్చు
దేశంలోని అన్ని బ్యాంకుల్లో గల రూ.100 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లతో పోలిస్తే ఈ అన్క్లెయిమ్డ్ సొమ్ము చాలా చిన్న మొత్తమే. ఈ డిపాజిట్లలో ఎక్కువ మొత్తం సొమ్ము మృతి చెందిన ఖాతాదారులకు లేదా అనేక బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తులదై ఉంటుందని, ఇందులో ఎక్కువ భాగం బినామీ సొమ్ము గానీ, అప్రకటిత సొమ్ము గానీ కాకపోవచ్చని ఐఐఎం-బీలో ఆర్బీఐ చైర్ ప్రొఫెసర్గా పనిచేసిన చరణ్ సింగ్ అంటున్నారు.
బ్యాంకింగ్ చట్టం సెక్షన్ - 26ఏ ప్రకారం డిపాజిటర్ సొమ్ము చెల్లించాల్సిందే
బ్యాంకింగ్ నియంత్రణా చట్టం - 1949లోని సెక్షన్ 26 ప్రకారం దేశంలో పదేళ్ల నుంచి లావాదేవీలు జరగని అన్ని ఖాతాల వివరాలను బ్యాంకులు ప్రతి క్యాలెండర్ సంవత్సరం ముగిసిన నెల వ్యవధిలోగా ఆర్బీఐకి సమర్పించాలి. పదేళ్ల గడువు ముగిశాక డిపాజిట్ సొమ్మును క్లెయిమ్ చేసుకోకుండా లేదా బ్యాంకు ఖాతాను నిర్వహించుకోకుండా ఏ డిపాజిట్ దారుడిని నిరోధించేందుకు వీల్లేదని, ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకింగ్ వ్యవస్థదేనని సెక్షన్ 26ఏ స్పష్టం చేస్తున్నది. పని చేయని ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ సొమ్మును డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో ఉంచుతారు. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2012లోని నిబంధనల కింద ఈ ఫండ్ ఏర్పాటైంది.
డీఐఎన్ కావాలంటే ముందు దరఖాస్తు చేయాల్సిందేనన్న కేంద్రం
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణం నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీల్లో బోర్డు డైరెక్టర్లుగా పని చేసేందుకు అనుమతి పొందిన వ్యక్తుల పాస్పోర్టు వివరాలను తెప్పించుకోవాలన్న ప్రతిపాదనను కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిశీలిస్తున్నది. డైరెక్టర్ గుర్తింపు నంబర్ (డీఐఎన్)ను కలిగి ఉన్న వ్యక్తికి ఒకవేళ పాస్పోర్టు లేకపోతే ఆ విషయమై అతని నుంచి ధృవీకరణ పత్రాన్ని పొందాలని ఆ శాఖ యోచిస్తున్నది. డీఐఎన్ను పొందాలనుకునేవారు తమ పాస్పోర్టు వివరాలను సమర్పించడం తప్పనిసరి చేయాలని, ఇందుకు అనుగుణంగా డీఐఎన్ దరఖాస్తు పత్రాన్ని సవరించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖ యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ.50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రుణాలను పొందిన ప్రతి ఒక్కరి పాస్పోర్టు వివరాలను 45 రోజుల్లోగా సేకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది.
2013 - 16 మధ్య రూ.36 చొప్పున పలుసార్లు జమ
నమోదుకాని పెట్టుబడి సలహాదారులపై సెబీ కొరడా ఝళిపించింది. ‘ఫాతల్ అట్రాక్షన్' పథకంతో పేరు పొందిన పరిశోధనా విశ్లేషకుడు అనిరుధ్ సేథీని సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. మదుపర్ల నుంచి వసూలు చేసిన ఫీజు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. 2013 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 20 మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో సేథీ బ్యాంక్ ఖాతాలోకి రూ.36,000 చొప్పున పలు సార్లు జమ అయ్యాయని సెబీ దర్యాప్తులో తేలింది. వెబ్సైట్ వివరాలు, పోస్ట్లు, ట్వీట్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్లను పరిశీలించిన సెబీ.. సేథీ బ్యాంక్ ఖాతాల్లో రూ.10 కోట్లకు పైగా జమ అయినట్లు గుర్తించింది.