పెరిగిన ఇంధన ధరలు, ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో పతనమైన రూపాయి విలువ
రాజస్థాన్లో బీజేపీకి ఓటమి, మధ్యప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుదని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో భారత మార్కెట్లు పతనం అయ్యాయి. రూపాయి విలువ కూడా పతనం అయ్యింది. శుక్రవారం వెలువడిన ఎగ్జిట్ ఫలితాల్లో కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారంలోకి వస్తుందని తేలింది. మిగతా రెండు రాష్ట్రాలు అయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు నువ్వానేనా అన్న రీతిలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 35169 దగ్గర ఆగిపోగా... నిఫ్టీ 138 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఇక శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 71.36తో ఉండగా సోమవారం 0.78శాతం పడిపోయి డాలరుతో రూపాయి మారకం విలువ 71.31 వద్ద ఆగింది. ఇక పదేళ్లు ప్రభుత్వ బాండ్లు 7.5 శాతం నుంచి 7.464 శాతానికి పడిపోయాయి.
ఇక చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనపడ్డాయి. వడ్డీ రేట్లు త్వరలోనే తగ్గించడం జరుగుతుందని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ప్రస్తుత ఖాతా లోటు, ముడి చమురు ధరల్లో పెరుగుదలతో రూపాయి మరియు బాండ్లు విలువ ఒత్తిడికి గురై పతనం దిశగా పయనించాయి.
మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు, బ్రెంట్ ముడిచమురు ధరలు కూడా పెరిగాయి. ఆయిల్ ఉత్పత్తి మరియు ఎగుమతి దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా చమురు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ఆయిల్ బ్యారెల్ ధర 62.21 డాలర్లకు చేరుకుంది. ఓపెక్ దేశాల మధ్య జరిగిన ద్వితీయ వార్షిక సమావేశం అనంతరం ధరలపై ఒక నిర్ణయానికి వచ్చాయి. ధరలను స్థిరంగా ఉంచేలా ఈ సమావేశంలో ఓపెక్ దేశాలు నిర్ణయించాయి.