సత్య నాదెళ్ల కీలక నిర్ణయం: 36మిలియన్ల షేర్లు అమ్మేశారు!
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల విలువైన 3,28,000(30శాతం) షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఒక్కో షేరు విలువ 109.08 డాలర్లు నుంచి 109.68డాలర్లు వరకు అమ్మినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సత్యనాదెళ్లకు ఉన్న వ్యక్తిగత ఆర్థిక కారణాల వల్లే ఆయన తన షేర్లను అమ్ముకున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు.
కంపెనీని గెలుపు బాటలో నడిపించడానికి నాదెళ్ల ఎల్లప్పుడు కృషి చేస్తూ ఉంటారని తెలిపింది. కాగా, మైక్రోసాఫ్ట్ సీఈవోగా 2014లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన తన వాటాలోని షేర్లను విక్రయించడం ఇది రెండోసారి.
రెండు సంవత్సరాల క్రితం నాదెళ్ల 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే. స్టాక్ సేల్ నివేదిక ప్రకారం ఆయన దగ్గర ఇంకా 7,78,596షేర్లు ఉన్నాయి. గతేడాది ఆయన 1.45మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు.