శుభవార్త: కనీస నగదు నిల్వ రూ.1000కు తగ్గింపుకు ఎస్బిఐ యోచన?
న్యూఢిల్లీ: కనీస నగదు నిల్వ విషయంలో ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా ఎస్బిఐ ఈ విషయమై సమీక్షించాలని భావిస్తోంది. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వను రూ.1000కు తగ్గించాలనే యోచనలో ఎస్బిఐ ఉందని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
పట్టణాల్లో రూ.3 వేలుగా ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను వెయ్యి రూపాయలకు తగ్గించాలని దాదాపు ఓ నిర్ణయానికి ఎస్ బి ఐ వచ్చినట్టు తెలుస్తోంది.ఎస్బిఐ కనీస నగదు నిల్వను గత ఏడాది ఏప్రిల్ మాసం నుండి మార్చింది.
గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా ఎస్బీఐ ప్రకటించింది. అయితే అంతలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ప్రభుత్వ ఒత్తిడి ఉందని సమాచారం.
ప్రస్తుతం ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను రూ.1000కి తగ్గించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతేడాదిలో ఎస్బీఐ కనీస నగదు నిల్వను రూ.5 వేలకు పెంచింది.
ఖాతాదారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
తాజాగా మినిమమ్ బ్యాలెన్స్ విధానంపై సమీక్ష జరపాలని, కనీస నగదు నిల్వను రూ.1000కు తగ్గించాలని నిర్ణయించింది. అయితే ఈ విషయమై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.