మొండిబకాయిలు: 4,876వేల కోట్ల నష్టాలను నమోదు చేసిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ నష్టాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,876కోట్లు నష్టపోయినట్లు ఎస్బీఐ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మొండిబకాయిలు 70శాతం పెరగడంతో భారీ నష్టాలను చవిచూసింది.
గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.2,000కోట్ల నికర లాభం నమోదు చేయగా, ఈసారి మాత్రం భారీగా నష్టపోయింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం పెరిగింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.62,911.08కోట్ల ఆదాయం రాగా, ఇప్పుడు రూ.65,492.67కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. గత ఏడాది జూన్ త్రైమాసికంలో బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 9.97శాతం పెరగగా, ఈ ఏడాది జూన్ నాటికి 10.69 శాతానికి పెరిగినట్లు ఎస్బీఐ వెల్లడించింది.
గతంలో రూ.1,88,068కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది రూ.2,12,840కోట్లుగా ఉన్నాయి. అయితే నికర నిరర్ధక ఆస్తులు మాత్రం గతంతో పోలిస్తే తగ్గాయి.
గత ఏడాది ఇవి 5.97శాతంగా ఉండగా, ఈసారి 5.29శాతానికి తగ్గాయి. అంటే గత ఏడాది రూ.1,07,560కోట్ల నికర నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.99,236కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంకు ప్రొవిజన్లు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. గతంలో రూ.8,929.48కోట్లుగా ఉండగా ఇప్పుడు రూ.19,228కోట్లుగా నమోదయ్యాయని ఎస్బీఐ తెలిపింది.