జైట్లీ దెబ్బకి కుప్పకూలి.. తిరిగి కోలుకుని.. చివరికి నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు!
ముంబై : ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. బడ్జెట్కు ముందు, బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత కొద్ది సేపటి వరకు మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి.
Recommended Video
కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ షాక్... స్టాక్ మార్కెట్లు ఢమాల్, తీవ్ర నిరాశలో మదుపరులు!
అయితే స్టాక్మార్కెట్లో పెట్టుబడులపై ఎల్టీసీజీ పన్ను విధించనున్నట్టు అరుణ్జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. ఆ తరువాత భారీ పతనం నుంచి కాస్త కోలుకున్నా సాయంత్రం వరకు ట్రేడింగ్ మాత్రం ఒడిదుడుకులుగానే సాగింది.
చివరికి నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ 58 పాయింట్ల నష్టంలో 35,906 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంలో 11,016 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ కూడా 159 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాలపాలే అయింది.
టాప్ గెయినర్లుగా ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, లార్సెన్, ఇండస్ఇండ్ బ్యాంకు నిలువగా.. టాప్ లూజర్లుగా ఓఎన్జీసీ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిలిచాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా బడ్జెట్ నేపథ్యంలో 16 పాయింట్లు బలహీనపడి 63.75గా ఉంది.
రూ. లక్షకు మించి ఆర్జిస్తే 10 శాతం పన్ను...
ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ. లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్లో జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీల లావాదేవీల ద్వారా పన్ను(ఎస్టీటీ) ఆదాయం రూ. 9,000 కోట్లు మాత్రమే లభిస్తున్నట్లు వెల్లడించారు.