భారీగా కోలుకున్న రూపాయి: లాభాలబాట పట్టిన మార్కెట్లు
ముంబై: గత కొద్ది రోజులుగా పతనమవుతున్న రూపాయి మారకం విలువ బుధవారం భారీగా కోలుకుంది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. రూపాయి పతనం కారణంగా గత రెండు రోజులుగా నష్టాలను చవిచూశాయి. అయితే రూపాయి బుధవారం కొంత కోలుకోవడంతో ఒక్కసారిగా సెన్సెక్స్ లాభాల బాటపట్టింది.
నిఫ్టీ సైతం 11,350 మార్కుకు పైకి ఎగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్ల లాభంతో 37,717 వద్ద, నిఫ్టీ 82పాయింట్ల లాభంలో 11,369 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాక్ట్ర్చర్, మెటల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ సైతం పైకి ఎగిసింది.
రూపాయి పతనం, ఇంధన ధరలపై ఈ వారాంతంలో ప్రధాని మోడీ సమీక్ష
ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ , ఐటీసీ వంటి కంపెనీల ర్యాలీ మార్కెట్లకు బాగా సహకరించింది. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ టాప్ గెయినర్లుగా నిలువగా.. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ ఎక్కువగా నష్టపోయాయి.
రూపాయి పరిస్థితిపై, దేశీయ ఆర్థిక పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారాంతంలో సమావేశం నిర్వహించనున్నట్టు రిపోర్టులు వెలువడగానే.. ఇన్వెస్టర్లు రూపాయిను కొనడం ప్రారంభించారు. దీంతో రూపాయి భారీగా రికవరీ అయి 71.86వద్ద కొనసాగుతోంది.