'బేర్' మార్కెట్లు: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ...సెన్సెక్స్ 1000పాయింట్ల పతనం
స్టాక్ మార్కెట్లు మళ్లీ రికార్డు స్థాయిలో కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ కూడా 11,300 మార్క్ పైన ట్రేడ్ అయ్యింది. శుక్రవారం ఉదయం సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, రూపాయి కోలుకోవడంతో ఉత్సాహంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. మధ్యాహ్న సమయంకల్లా రికార్డు స్థాయిలో 35,993.64 పాయింట్లకు పడిపోయింది. నిఫ్టీ కూడా 11000 పాయింట్లకంటే తక్కువగా పడిపోయింది. ఆ తర్వాత సెన్సెక్స్ కాస్త కోలుకుంటున్నట్లు కనిపించింది.
ట్రేడింగ్లో యస్ బ్యాంక్ భారీగా నష్టాలు చవిచూసింది.యస్బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ రానా కపూర్ రాజీనామా చేయాల్సిందిగా ఆర్బీఐ కోరడంతో ఒక్కసారిగా ఆ బ్యాంకుకు సంబంధించిన సెన్సెక్స్ 19 శాతానికి పడిపోయింది. ఇక నష్టాలు చవిచూసిన కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, టీసీఎస్లు 0.46శాతం మేర నష్టపోయాయి. మరోవైపు దేశీ పెట్టుబడిదారులు రూ.1,201.30కోట్లతో షేర్లు కొనుగోలు చేయగా... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.2,184.55 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మకానికి పెట్టారు. ఇక ఓవర్సీస్లో ఆసియా మార్కెట్లు మంచి ఫలితాలే కనబర్చాయి.
షాంఘై కంపోసిట్ ఇండెక్స్ 0.90శాతం లాభం నమోదు చేయగా.. హాంగ్ కాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ 1శాతం లాభాలు నమోదు చేసింది. జపాన్ నిక్కీ 0.50 శాతం పెరుగుదల కనిపించింది. ఇక అమెరికా షేర్ మార్కెట్ డోజోన్స్ యావరేజ్గా 0.97 శాతం పెరుగుదల నమోదు చేసింది.