రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసిన మార్కెట్లు
గతకొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల బాట నడుస్తున్నాయి. సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రారంభం నుంచే ఉత్సాహంగా సాగిన సూచీలు చివరి వరకూ అదే ఊపును కొనసాగించాయి. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో పయనించడంతో సోమవారం మార్కెట్లు కళకళలాడాయి. రికార్డు స్థాయిలో లాభపడ్డాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో ప్రారంభంకాగా... నిఫ్టీ 57 పాయింట్లతో ప్రారంభమైంది. ఒకానొక దశలో ఎప్పుడూ లేనంతగా నిఫ్టీ రికార్డు క్రియేట్ చేస్తూ 11వేల 424 పాయింట్లకు చేరింది. చివరకు సెన్సెక్స్ 135.73 పాయింట్ల లాభంతో 37691.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిసింది. వర్షాకాలం చివరలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ గత వారం వెల్లడించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది.
ఇదిలా ఉంటే సోమవారం జరిగిన ట్రేడింగ్లో బ్యాంకుల షేర్లు లాభాల్లో పయనించాయి. ఆ తర్వాత ఆటో, స్టీల్, రంగాల షేర్లు ప్రాఫిట్ నమోదు చేశాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతి ఎయిర్టెల్, యూపీఎల్ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. గెయిల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, కొటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, హెచ్యూఎల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.78వద్ద ట్రేడవుతోంది.యూరోప్, ఇతర ఆసియా దేశాల్లో షేర్లు లాభాలు నమోదు చేయడంలో మందగించాయి. ఇ:దుకు కారణం అమెరికా చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేనని విశ్లేషకులు చెబుతున్నారు.