భారీ నష్టాలు: సెన్సెక్స్ 500పాయింట్లు, నిఫ్టీ 11,400, మరింత క్షీణించిన రూపాయి
ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ వైపు అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధ పరిస్థితులు.. మరోవైపు రూపాయి పతనం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సోమవారం ఉదయం సూచీలు నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ కూడా 100పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయ్యింది. ఇక దేశీయంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల సూచీలను కుదిపేశాయి. దీంతో ఆరంభం నుంచే భారీ నష్టాల్లో సాగిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత మరింత దిగజారాయి.
చివరి గంటల్లో సెన్సెక్స్ 511 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 505పాయింట్లు నష్టపోయి 37,585 వద్ద స్తిరపడింది. అటు నిఫ్టీ కూడా 137 పాయింట్ల నష్టంతో 11,378 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 59పైసలు నష్టపోయి 72.44గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, టెక్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు స్వల్పంగా లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, టైటాన్, సన్ఫార్మా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నష్టపోయాయి.