జీఎస్టీ శుభవార్త, డిజిటల్ లావాదేవీలపై 20 శాతం క్యాష్ బ్యాక్, గరిష్టంగా రూ.100
న్యూఢిల్లీ: నగదు చెల్లించకుండా రూపే కార్డ్, భీమ్ యాప్, యూపీఐల ద్వారా చెల్లింపులు జరిపితే 20 శాతం జీఎస్టీ క్యాష్ బ్యాక్ ఇవ్వాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. నగదురహిత లావాదేవీలపై ప్రోత్సహకాలు ఇవ్వడం ద్వారా యూపీఐ వ్యవస్థలను, గ్రామాల్లో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ను పెంచాలని భావిస్తున్నట్లు జీఎస్టీ మండలి శనివారం తెలిపింది.
గరిష్ఠంగా రూ.100 వరకూ జీఎస్టీ క్యాష్ బ్యాక్ ఉంటుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీనిని చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ మోడీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం క్యాష్ బ్యాక్ పాలసీపై అధ్యయనం చేసి, రిపోర్టును అందించిందన్నారు. ఈ విధానంలో ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? అని అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
భవిష్యత్తులో జీఎస్టీ శ్లాబ్లు మరింత తగ్గే అవకాశముందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు సంజీవ్ సన్యాల్ తెలిపారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శ్లాబులుగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మూడు శ్లాబులుగా చేసే అవకాశాలు ఉన్నాయ తెలిపారు. 12, 18 శాతం శ్లాబ్లను విలీనం చేసి 15 శాతం శ్లాబ్గా మార్చవచ్చునని చెప్పారు.
క్యాష్బ్యాక్లను తీసుకురావాలన్న జీఎస్టీ మండలి నిర్ణయాన్ని నిపుణులు ఆహ్వానించారు. ఇది ఆదాయంపై మంచి ప్రభావాన్ని చూపుతుందన్నారు. కేవలం పరిమిత వినియోగదార్లకు దీనిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావడం ప్రభుత్వ ప్రణాళికకు నిదర్శనమని చెబుతున్నారు.
29 వస్తువులపై జీఎస్టీ తగ్గించాలి
సామాన్యులు ఉపయోగించే 29 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ మండలిని డిమాండ్ చేశారు. సిమెంట్, సినిమాలపై పన్నురేట్లు కుదించాలని కోరారు. ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల భారాన్ని సీజీఎస్టీ, ఐజీఎస్టీ రీయింబర్స్మెంట్ రూపంలో కేంద్రమే భరించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. అలాగే, ఏపీ గిరిజన సహకార సంస్థ కేవలం అటవీ ఉత్పత్తులను తప్పించాలన్నారు.