జియోకు ఎమినెన్స్ హోదా, విమర్శలు: కేంద్రం వివరణ
Recommended Video
న్యూఢిల్లీ: జియో ఇనిస్టిట్యూట్కు కేంద్రం శ్రేష్ఠతర హోదా ఇచ్చింది. ఇంకా ప్రారంభమే కానీ ఆ సంస్థకు ఆ హోదా ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల నుంచి మూడేసి చొప్పున యూనివర్సిటీలకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కల్పించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూర్ సహా మూడు ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. బిట్స్ పిలానీ, మణిపాల్ విశ్వవిద్యాలయం, జియో యూనివర్సిటీ తదితర సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
గ్రీన్ ఫీల్డ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 11 ప్రయివేటు ఇనిస్టిట్యూట్లలో కేవలం జియో యూనివర్సిటికీ మాత్రమే చోటు దక్కింది. అసాధరణ పరిపాలన, విద్యా విషయక స్వయం ప్రతిపత్తిని కల్పించడంలో భాగంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా ఇస్తారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రిలయెన్స్ ఫౌండేషన్కు కేంద్రం అనుకూలంగా ఉందని తేలిపోయిందని, ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఏ ప్రమాణాల ఆధారంగా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసింది.
విమర్శల నేపథ్యంలో కేంద్రం వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కారణంగానే అపార్థాలు తలెత్తినట్టు పేర్కొంది. రిలయన్స్ ఫౌండేషన్ నేతృత్వంలో ప్రారంభం కానున్న జియో యూనివర్సిటీకి ప్రస్తుతం అంగీకార పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) మాత్రమే ఇచ్చామని నిపుణుల కమిటీ చైర్మన్ గోపాల స్వామి వెల్లడించారు. మూడేళ్ల తర్వాత సదరు సంస్థ హామీ ఇచ్చిన లక్ష్యాలను చేరుకుంటేనే ఎమినెంట్ హోదా ఇస్తామని, లేకుంటే ఈ జాబితాలో స్థానం ఉండదన్నారు. స్పష్టమైన విద్యా, పరిపాలనా ప్రణాళికలు, నిధులు, భూకేటాయింపులతో సిద్ధంగా ఉన్నందున జియోకి ఈ హోదా కల్పించామన్నారు.