ఆర్బీఐ ప్రకటన ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ముంబై: భారత రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రేపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసిన అనంతరం దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమై.. 34,253 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలను నమోదు చేసింది.
అంచనాలకు అందలేదు: యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు
నిఫ్టీ ఇండెక్స్ కూడా భారీగా 316 పాయింట్లు కుప్పకూలింది. ఒక్కసారిగా 10,300 మార్కు కిందకి వచ్చి చేరింది. ఇక మార్కెట్ అవర్స్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 792 పాయింట్లు నష్టపోయి 34,376 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు పతనమై 10,316 వద్ద ముగిసింది.
రూపాయి కూడా ఆర్బీఐ ప్రకటన తర్వాత చారిత్రాత్మక కనిష్టస్థాయి 74ను తాకింది. 2019 మార్చిలో క్వార్టర్ వరకు ద్రవ్యోల్బణ 4.5శాతానికి పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. నిఫ్టీ ఇండెక్స్లో మెజార్టీ స్టాక్స్ నష్టాల్లోనే నడిచాయి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ, గెయిల్, ఓఎన్జీసీలు దాదాపు 25శాతం వరకు క్షీణించాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మేర పడిపోవడానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలపై గురువారం కేంద్ర ప్రభుత్వం రూ.2.50 కోత పెట్టడమే. కేవలం భారతీ ఇన్ఫ్రాటెల్, టైటాన్, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్లు మాత్రమే 1.25శాతం నుంచి 2.50శాతం మధ్యలో లాభపడ్డాయి.