భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు: ఆల్ టైం కనిష్టానికి రూపాయి మారకం
ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం ఉదయం నమోదైన లాభాలను నిలుపుకోకపోవడంతోపాటు భారీ నష్టాలను చవిచూశాయి. జీడీపీ గణాంకాల సానుకూలతతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు మంచి లాభాలు నమోదు చేశాయి. అయితే, సాయంత్రం వరకు ఆ జోరును కొనసాగించలేక చతికిలపడ్డాయి.
చివరి గంటల్లో వెల్లువెత్తిన అమ్మకాల కారణంగా మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. ఏప్రిల్-జూన్ ట్రైమాసికంలో జీడీపీ రెండేళ్ల గరిష్టానికి చేరిందన్న వార్తలతో సోమవారం ఉదయం లాభాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్ఛేంజి(బీఎస్ఈ) సెన్సెక్స్ 140 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టగా.. నిఫ్టీ 11,700 మార్క్ పైన ట్రేడ్ అయ్యింది. అయితే, ఆ లాభాలు సాయంత్రం వరకు మాత్రం ఆగలేదు. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి.
సోమవారం మధ్యాహ్నం తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీలు చివరకు భారీగా పతనమయ్యాయి. సోమవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ దాదాపు 380 పాయింట్లు దిగజారి 38,312 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 11,582 పాయింట్ల వద్ద ముగిసింది. అటు రూపాయి విలువ కూడా క్రాష్ అయింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ కూడా ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 71.21కి చేరింది.