ట్రంప్ ట్రేడ్ వార్: స్టాక్ మార్కెట్లు విలవిల.. రూ.1.57 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు స్టాక్ మార్కెట్లు విలవిల్లాడాయి. మొన్నటికి మొన్న స్టీల్, అల్యుమినియం దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకం విధించారు. తాజాగా చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకం విధించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లను కలవరానికి గురిచేసింది.
ప్రపంచ వ్యాణిజ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి.
ప్రారంభం నుంచే కుప్పకూలిన ట్రేడింగ్
ఫలితంగా వారంతం ట్రేడింగ్ ప్రారంభం నుంచే కుప్పకూలిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనం చెందిన బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ చివరకు 409.73 పాయింట్లు లేదా 1.24 శాతం నష్టంతో 32,596.54 వద్దకు జారుకున్నది. గతేడాది అక్టోబర్ 23 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 10 వేల దిగువకు పడిపోయింది. గురువారం నాటి ముగింపుతో పోలిస్తే 116.70 పాయింట్లు (1.15 శాతం) తగ్గి 9,998.05 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. మదుపరుల్లో ఆందోళన తీవ్రతరం కావడంతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా రూ.1.57 లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల విలువ రూ.1,39,30,643 కోట్లుగా నమోదైంది.
ట్రంప్ ఆంక్షలతో మార్కెట్లలో ప్రకంపనలు
చైనా నుంచి వచ్చే దిగుమతులపై దాదాపు 60 బిలియన్ డాలర్ల పన్నులు విధించాలని పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గడిచిన నాలుగు వారాలుగా దిగువముఖం పట్టిన సూచీలు ఈ వారంలోనూ పతనం చెందాయి. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్ 579.46 పాయింట్లు (1.75 శాతం), నిఫ్టీ 197.10 పాయింట్లు (1.93 శాతం) నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్లో 24 నష్టపోగా, కేవలం ఆరు మాత్రమే లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ 3.31 శాతం తగ్గగా, మెటల్ 2.89 శాతం, బ్యాంకెక్స్ 2.08 శాతం పతనం చెందాయి. వీటితోపాటు క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, పీఎస్యూ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ విభాగాలకు చెందిన షేర్లు దిగువముఖం పట్టాయి.
కుప్పకూలిన ఎనిమిది బ్యాంకుల షేర్లు
హిందుస్థాన్ జింక్, టాటాస్టీల్, ఎన్ఎండీసీ, జేఎస్డబ్ల్యూ కంపెనీల షేర్లు ఏడు శాతం వరకు పతనం చెందాయి. ఎనిమిది బ్యాంకులను టోటెమ్ ఇన్ఫ్రా రూ.1,394 కోట్లకు మోసగించినట్లు సీబీఐ కేసు దాఖలు చేయడంతో ఈ రంగ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 471.10 లేదా 1.95 శాతం చొప్పున పతనం చెంది ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయి 23, 670.40కి పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్, పీఎన్బీ, యెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ల షేర్లు 3.87 శాతం వరకు తగ్గాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 8.29 శాతం తగ్గి రూ.86.85కి జారుకున్నది.
52 వారాల కనిష్ట స్థాయికి 419 స్టాక్లు
టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్డీఎఫ్సీ, సన్ఫార్మా, హీరో మోటోకార్ప్, హెచ్యూఎల్, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఐటీసీ, టీసీఎస్, ఎన్టీపీసీలు రెండు శాతంకు పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. కానీ ఐటీ, మీడియా రంగ షేర్లు లాభాల్లో ముగియడం విశేషం. అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఒక శాతంవరకు లాభపడ్డాయి. 419 స్టాక్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకోగా, 23 మాత్రం ఏడాది గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్లదీ అదే పరిస్థితి
అమెరికా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తాయి. దీంతో వాల్స్ట్రీట్ జర్నల్ భారీగా నష్టపోగా మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా దిగువముఖం పట్టాయి. జపాన్కు చెందిన నిక్కీ 4.51 శాతం పతనం చెందగా, హాంకాంగ్స్కు చెందిన హ్యాంగ్సెంగ్ 2.45 శాతం, షాంఘై కంపోసైట్ ఇండెక్స్ 3.39 శాతం వరకు కోల్పోయింది.