సుప్రీంకోర్టు స్టే: అంబానీ బ్రదర్స్ డీల్కు మరోసారి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ/ముంబై: అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన టవర్ల విక్రయానికి వీలుగా జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన అనుమతులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
దీనికి సంబంధించి హెచ్ఎస్బీసీ డైరీ ఇన్వెస్ట్మెంట్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ వాటాదార్లు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెల్లడించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్తో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ ఆ భారాన్ని తగ్గించుకునేందుకు గత డిసెంబరులో సోదరుడు ముఖేశ్ అంబానీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఆర్కామ్కు చెందిన రూ.24వేల కోట్ల విలువైన వైర్లెస్ ఆస్తులను ముఖేశ్కు చెందిన రిలయన్స్ జియోకు విక్రయించేందుకు డీల్ కుదిరింది. ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాటెల్కు చెందిన టవర్లు, ఫైబర్ ఆస్తులు కూడా ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 8వేల కోట్లు. అయితే ఈ ఆస్తుల విక్రయంపై స్వీడన్కు చెందిన ఎరిక్సన్ కంపెనీ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది.
తమ బకాయిలు చెల్లించకుండా ఆస్తులు విక్రయిస్తున్నారని ఆరోపించింది. దీంతో అనుమతులు లేకుండా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులు అమ్మరాదని ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుపై ఆర్కామ్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా సంస్థకు నిరాశే ఎదురైంది. ఆస్తులు విక్రయించకుండా హైకోర్టు స్టే విధించింది. తాజాగా, సుప్రీం కోర్టు కూడా స్టే ఇవ్వడంతో అంబానీ బ్రదర్స్ డీల్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.