దేశంలోనే తొలిసారి, 100 బిలియన్ డాలర్ల కంపెనీగా రికార్డ్ సృష్టించిన టీసీఎస్
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చరిత్ర సృష్టించింది. దేశంలో తొలి 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే మన లెక్కల్లో రూ.6,60,000 కోట్లకు పైగా. సోమవారం నాటి మార్కెట్లో ఈ ఘనత సాధించింది.
ఉదయం పది గంటల సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,62,726.36 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ షేర్లు 4.6 శాతం ఎక్కువ లాభం పొందాయి. దీంతో 3,557.90 రికార్డ్ స్థాయిలోను ట్రేడ్ అయింది.
టీసీఎస్ 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడంపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఇదో ప్రత్యేకమైన క్షణమని, దీని కోసం మేం ఎదురుచూస్తూ ఉన్నామన్నారు. రాబోయే నెలలు, త్రైమాసికాల్లోనూ టీసీఎస్ మరింత ముందుకెళ్తుందన్నారు.
కాగా, ఇటీవల టీసీఎస్ గత ఆర్థికసంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో శుక్రవారం నాటి షేర్ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పెరిగింది. ఆ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ విలువ రూ. 40 వేల కోట్లు పెరిగింది. దీంతో 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకునేందుకు మరింత దగ్గరకు వచ్చింది. సోమవారం ఆ ఘనత దక్కించుకుంది.
దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ ఇదే. టీసీఎస్ ప్రధాన పోటీదారు ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ దాదాపు 38 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ఇప్పట్లో ఏ ఐటీ సంస్థా ఈ ఘనత దక్కించుకునేలా లేదని భావిస్తున్నారు.