నీల్సన్తో టీసీఎస్ బిగ్ డీల్: 14వేల కోట్ల ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్
ముంబై: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) భారీ ఆర్డర్ను సాధించింది. టెలివిజన్ రేటింగ్ మేనేజ్మెంట్ సంస్థ నీల్సన్ తో అతి భారీ విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. టిసిఎస్-నీల్సన్ ఒప్పందం పునరుద్ధరణలో భాగంగగా ఈ భారీ డీల్ కుదిరింది.
2.25 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.14వేల కోట్లు) అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టును గెలుచుకుంది. టీసీఎస్తో ఈ కాంట్రాక్టును ఐదు సంవత్సరాల వరకు (2025) పొడిగించామని, ఈ డీల్ డిసెంబర్ 31, 2025 న ముగుస్తుందని నీల్సన్ ప్రకటనలో తెలిపింది.
భారీగా ఆదాయం
రెగ్యులేటరీ (అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్) ఫైలింగ్లో దీనికి సంబంధించిన వివరాలను అందించింది. తాజా ఒప్పందం ప్రకారం నీల్సన్ నుంచి 2017నుంచి 2020వరకు ప్రతి సంవత్సరం 320 మిలియన్ డాలర్లు ఆదాయాన్ని, 2021 నుంచి 2024 వరకు 139.5 మిలియన్ డాలర్లు, 2025 నాటికి 186 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని టీసీఎస్ పొందనుంది.
దేశంలోనే అతిపెద్ద డీల్
టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ కు ఇది ఒక ప్రధానమైన ఒప్పందంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ ఐటీ పరిశ్రమలోనే ఇది అతి పెద్ద డీల్గా నిపుణులు పేర్కొన్నారు.
ఆర్ఐఎల్కు ధీటుగా..
మరోవైపు ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు పోటీగా భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా టీసీఎస్ రెండవ స్థానంలో నిలిచింది. ఆర్ఐఎల్ మొదటిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
దూసుకెళ్లనున్న టీసీఎస్
2007 లో టీసీఎస్-నీల్సన్ మధ్య1.2 బిలియన్ డాలర్లు, 2013లో దాదాపు రెట్టింపు విలువతో 10 సంవత్సరాలకుగాను 2.5బిలియన్ డాలర్ల కాంట్రాక్టు కుదిరింది. దీన్ని మరో మూడేళ్ల పాటు 2020వరకు పొడిగించింది. కాగా, తాజా ఒప్పందంతో రాబోయే సంవత్సరాల్లో అత్యధిక విలువైన భారతీయ కంపెనీలను అధిగమిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.