2018లో బడ్జెట్: రైతుల పన్ను వడ్డనకు పెరుగుతున్న డిమాండ్లు.. ఎన్నికల వేళ మోదీ సర్కార్ సాహసిస్తుందా?
న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజానీకాన్ని, జీఎస్టీ అమలుతో పారిశ్రామిక, వాణిజ్య వ్యాపారవేత్తలను పన్ను చట్రంలోకి తీసుకొచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. తాజా దేశంలో పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేయడంతో పాటు కొత్తగా మరో వర్గం ప్రజలను పన్ను పరిధిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నది. తద్వారా ఆదాయం పన్ను వసూళ్లను పెంచుకోవాలని తహతహలాడుతున్నది. సంపన్న రైతులపై పన్నులు విధించడంతో దండిగా ఆదాయం రాబట్టాలని యోచిస్తున్నది.
Recommended Video
ప్రస్తుతం దేశంలోని 70 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న కమతాలను (ఒక హెక్టారులోపు విస్తీర్ణం ఉన్న పంట భూములను) కలిగి ఉండగా, కేవలం 0.4 శాతం వ్యవసాయ కుటుంబాల వద్దే పెద్ద కమతాలు (పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం గల పంట భూములు), 3.7 శాతం వ్యవసాయ కుటుంబాల వద్ద 4 నుంచి 10 హెక్టార్లలోపు విస్తీర్ణం గల పంట భూములు ఉన్నాయని నేషనల్ శాంపిల్ సర్వే స్పష్టం చేస్తున్నది.
గతేడాదే కేంద్రానికి అరవింద్ సుబ్రమణ్యం ఇలా సూచన
వీరిలో చివరి రెండు కేటగిరీల్లోని 4.1 శాతం మంది ధనిక రైతులపై సగటున 30 శాతం వ్యవసాయ పన్ను విధించినా ప్రభుత్వానికి కనీసం రూ.25 వేల కోట్ల రాబడి వస్తుందని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ట్యాక్స్ టీమ్ లీడర్ రజుల్ అవస్థి చెబుతున్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా ఇదే సూచన చేశారు. సంపన్న రైతులపై పన్నులు విధించాలని ఆయన గతేడాదే కేంద్రానికి స్పష్టం చేశారు. ఆదాయం ఏ రంగంలో వస్తున్నదన్న విషయంతో నిమిత్తం లేకుండా ధనిక రైతుల గురించి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
30 కోట్ల మంది పాన్ కార్డు దారులే పన్ను చెల్లింపు ఇలా
రైతులపై పన్ను విధించాలన్న ఆలోచనేమీ తమకు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ‘అటువంటి ఆలోచనేదీ కేంద్ర ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగం కేటాయించిన అధికారాల ప్రకారం చూసినా కూడా వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అధికారం కేంద్రానికి లేదు' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆరెస్సెస్ స్ఫూర్తి గల చార్టర్డ్ అక్కౌంటెంట్లు తప్పనిసరిగా సంపన్న రైతులపై తప్పనిసరిగా పన్ను విధించాలని నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు. దేశంలో కేవలం 30 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు మాత్రమే నాలుగు కోట్ల ఆదాయం పన్ను చెల్లిస్తున్నారు. ఏటా రూ. కోటికి పైగా కలిగి ఉన్న సంపన్న రైతులపై ఎందుకు పన్ను విధించకూడదని భారతీయ విట్టా సాలాహ్కార్ సమితి చీప్ అనిల్ గుప్తా ప్రశ్నించారు. ఇదే ప్రశ్న 2014లోనూ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్ కమిషన్ నివేదికలోనూ లేవనెత్తింది. 2002లో ఏర్పాటైన విజయ్ కేల్కర్ కమిటీ ఈ అంశాన్ని ప్రస్తావించింది. రాష్ట్రాలు వ్యవసాయంపై పన్ను విధించాలని సిఫారసు చేసింది.
భారీ ఆదాయం పొందుతున్న రైతులూ పన్ను చెల్లించాల్సిందే
అయితే వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరూ నిరోధించలేరని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన అడ్డంకి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఎటువంటి అవరోధాలు లేవని, కనుక వ్యవసాయ ఆదాయంపై రాష్ర్టాలు పన్ను విధించదల్చుకుంటే పేద, ధనిక రైతుల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసి నిక్షేపంగా ఆ పని చేయవచ్చని అరవింద్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వేతన జీవులు మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. భారీగా ఆదాయం పొందుతున్న వ్యవసాయదారులు పన్ను చెల్లించాల్సిందేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.
మూడేళ్ల ఆదాయం సగటుపై పన్ను విధింపు
ఈ నెల 15వ తేదీన ‘నీతి ఆయోగ్' నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయితే ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నందున విధాన నిర్ణయం ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని నీతి ఆయోగ్ అంగీకరించింది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. తదుపరి మూడు సంవత్సరాల్లో చేపట్టాల్సిన పనుల విషయమై గతేడాది ప్రకటించిన కార్యాచరణ ముసాయిదాలో నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన చేసింది. రైతులకు మూడేళ్ల పాటు వచ్చే సగటు ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకుని వ్యవసాయ ఆదాయంపై విధించాల్సిన పన్నును మదింపు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది.
వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని అరుణ్ జైట్లీ
2016 - 17లో వివిధ త్రుణ ధాన్యాలు, పప్పు ధాన్యాలపై కనీస మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్ లో ధర లభించడంతో రైతులు ఆగ్రహించారు. దీనివల్ల రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఆందోళన బాట పట్టించారు. దీని ఫలితంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పంట రుణాల మాఫీ నినాదం ముందుకు వచ్చింది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతుల దరి చేరేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం సొంతంగా కనీస మద్దతు ధరలు నిర్ణయించింది. విజయ్ కేల్కర్ కమిటీ, నీతి ఆయోగ్ వంటి సంస్థలు సంపన్న రైతులపై పన్ను విధించాలని సిఫారసు చేసినా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, ఆపై లోక్ సభ ఎన్నికల ముందు మోదీ సర్కార్ అందుకు పూనుకుంటుందా? సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమర్పించనున్న బడ్జెట్ ప్రతిపాదనల్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా పేర్కొనడం కొసమెరుపు.