2018లో బడ్జెట్: కుటుంబ నియంత్రణపై పేరుకే ప్రకటనలు.. నిర్దిష్ట చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018 - 19 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ, సాధారణ వ్యాధుల నివారణకు నిధులు పెంచాలన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. జాతీయంగా ఆరోగ్యరంగంపై వ్యయం పెంపొందించాలని, ఆరోగ్య బీమాను కలుపుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జనాభాతోనే సామాజిక ఆర్థిక ప్రగతి లక్ష్యాలను చేరుకోగలమని నిపుణులు, మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఇందుకోసం జాతీయ ఆరోగ్య విధానాన్ని అమలులోకి తేవాలన్న సూచనలు వెలువడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 2025 నాటికి జీడీపీలో ఆరోగ్య రంగానికి 1.15 శాతం నుంచి 2.5 శాతం నిధులను కేటాయిస్తామని చెప్తోంది.
కాగా, కుటుంబ నియంత్రణ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన కేంద్రం.. అందుకోసం 300 కోట్ల డాలర్లు ఖర్చు చేయడం ద్వారా జనాభా పెరుగుదలను స్థిరీకరించడానికి చర్యలు తీసుకుంటామని గతేడాది జరిగిన ఒక సదస్సులో ప్రతీన బూనింది ప్రభుత్వం. అయితే 2016 - 17లో ఆరోగ్య శాఖకు జరిగిన కేటాయింపుల్లో కేవలం 60.7 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయడమే ఆరోగ్య రంగం పట్ల ప్రభుత్వానికి గల ఆసక్తిని తెలియజేస్తున్నదని విమర్శ ఉన్నది. కానీ ఈ ఏడాదైనా ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపుతోపాటు ఖర్చులోనూ పెద్దపీట వేయాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి.
మాతా, శిశు మరణాల తగ్గింపునకు ఇలా లక్ష్యాలు నిర్దేశించాలి
బడ్జెట్ కేటాయింపులు పెరిగితే ఆటోమేటిగ్గా ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి పెట్టే ఖర్చు పెరుగుతుందని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనం ముత్రేజా వ్యాఖ్యానించారు. కుటుంబ నియంత్రణకు కేటాయించిన నిధులను మెరుగ్గా వినియోగించుకుంటే ప్రభుత్వం తన విజన్ అమలులోకి తీసుకు రావడానికి వెసులుబాటు లభిస్తుందన్నారు. బెంగళూరులోని ఇనిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఉషా మంజునాథ్ స్పందిస్తూ 2018 - 20 మద్య మాతృత్వ మరణాల రేటును 100కు, నవజాత శిశువుల మరణాలను 2019 నాటికి 28 శాతానికి తగ్గించేందకు ప్రభుత్వం స్వల్ప, మధ్య కాలిక లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు.
Recommended Video
వెల్ నెస్ సెంటర్లుగా గ్రామీణ సబ్ సెంటర్లను తీర్చిదిద్దాలి
బోదకాలు, కాల అజార్ వంటి వ్యాధులను 2017 నాటికి, లెప్రసీని 2018, మీజిల్స్ 2020 నాటికి, 2025 నాటికి క్షయ వ్యాధుల నిర్మూలనకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లక్ష్యాలు ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. ఈ లక్ష్యాల సాధనకు జీడీపీలో నిర్దిష్ట కాలం ప్రకారం 2.5 శాతం నిధులు ప్రజారోగ్యానికి ఖర్చు చేయాలని 2017 జాతీయ ఆరోగ్య విధానం హామీ ఇస్తున్నదని, తద్వారా అణగారిన వర్గాలతోపాటు భారతీయులందరికీ ఆరోగ్య పరిరక్షణ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె చెప్పారు. ఈ దిశలో భాగంగా గ్రామాల్లో ఉన్న 1.5 లక్షల సబ్ సెంటర్లను ఆరోగ్య, వెల్ ెస్ సెంటర్లుగా మార్చాలని సూచించారు. కానీ సాంక్రమిత వ్యాధులపై పోరుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదని ఆమె గుర్తు చేశారు. ఇంప్లాంట్లు విదేశాల నుంచి కొనుగోలు చేసి, మిగతా ఫార్మాస్యూటికల్ అవసరాలను దేశీయ మార్కెట్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం ద్వారా దారిద్ర్యరేఖకు దిగువన గల బీపీఎల్ కుటుంబాలకు రూ.లక్ష ఆరోగ్య బీమా పథకం వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నామన్నారు. దీన్ని రూ. 2 లక్షల లోపు ఆదాయం గల కుటుంబాలకు విస్తరించాలని సూచించారు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన (ఆర్ఎస్బీవై) కింద బీపీఎల్ కుటుంబాల వారికి జారీ చేసే హెల్త్ కార్డులతో రూ.30 వేల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లో ఇన్ పేషంట్ సేవలు పొందే వెసులుబాటు కల్పించాలన్నారు. ఇక సీనియర్ సిటిజన్లు, కీలక ఆరోగ్య సమస్యలపై రూ. లక్ష మేరకు ఆరోగ్య బీమా సౌకర్యం పెంచాలని ప్రతిపాదించారు.
హెల్త్ కేర్ వ్యవస్థ అభివ్రుద్ది దిశగా ముందడుగు
దేశీయంగా రోజురోజుకు ప్రాణాంతక వ్యాధుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ రంగాన్ని తక్షణం బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్య రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా క్రియాశీలమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం శుభారంభాన్నిచ్చిందని, ఇదే మార్గంలో ముందడుగు వేయాలని కోరుతున్నారు. ప్రాథమికంగా ఆరోగ్య పరిరక్షణ ప్లాట్ఫామ్లను విస్త్రుతపరచడంతోపాటు బలోపేతం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన ఆసుపత్రులకు ట్యాక్స్ హాలీడే ప్రకటించాలన్న అభ్యర్థనలు వెలువడుతున్నాయి. చౌకగా నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణకు వైద్య బీమా రంగాన్ని బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో హెల్త్ కేర్ వ్యవస్థ అభివ్రుద్ది దిశగా ముందడుగు వేయాలని, విధానాన్ని రూపొందించాలని వైద్య రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
వ్యాధుల నివారణకు వీలుగా ఆరోగ్య పరిరక్షణ రంగానికి మెరుగులు
మెడికల్, నర్సింగ్ స్కూళ్ల ఏర్పాటు ద్వారా వైద్య ఆరోగ్య రంగంలో భారతదేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకు సరిపడా, సుస్థిరమైన మద్దతునివ్వాలని, మౌలిక వసతులను అభివ్రుద్ధి చేయడంలో ప్రతిభకు పెద్దపీట వేయాలని వైద్య, ఆరోగ్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. అదనపు మినహాయింపులు కల్పించడం ద్వారా ఆరోగ్య బీమాకు డిమాండ్ పెంపొందించేందుకు జాతీయ ఆరోగ్య పరిరక్షణ విధానాన్ని రూపొందించాలని అభ్యర్థిస్తున్నారు. పూర్తిస్థాయిలో వ్యాధుల నివారణకు వీలుగా ఆరోగ్య పరిరక్షణ రంగాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నారు.