వొడాఫోన్ - ఐడియా కేఎం బిర్లా ఎగ్జిక్యూటివ్ చైర్మన్.. 3 నెలల్లో విలీనం పూర్తి
ముంబై: టెలికం రంగంలోకి రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేయడంతో ఇప్పటివరకు కార్యకలాపాలు నిర్వహించిన వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ తదితర సంస్థలు పలు ఇబ్బందులు పడుతున్నాయి. వినియోగదారుల పునాదిని కాపాడుకోవడంలో రిలయన్స్ జియోతోపాటు ఎయిర్టెల్ ఆఫర్లతో ముంచెత్తుతూ ఉన్నాయి.టెలికం సంస్థల మధ్య విలీనం దిశగా జరిగిన చర్చల్లో ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా కూడా పాల్గొన్నాయి. ఈ రెండు సంస్థల విలీనం చివరి అంకానికి చేరింది.
విలీనం గ్రూప్ సీఈఓగా వొడాఫోన్ సీఓఓ బాలేశ్ శర్మ
ఈ నేపథ్యంలోనే విలీన సంస్థకు ఐడియా సెల్యూలార్ - వొడాఫోన్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కుమార మంగళం బిర్లా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఓఓ) బాలేశ్ శర్మ విలీన గ్రూప్ సీఈఓగా వ్యవహరిస్తారని ఆ రెండు సంస్థలు గురువారం ప్రకటించాయి.
విలీన గ్రూపు సీఎఫ్ఓగా ఐడియా సీఎఫ్ఓ ముంద్రా
ఐడియా సెల్యూలార్ - వొడాఫోన్ ఇండియా విలీన సంస్థ వ్యాపార వ్యూహాలను బాలేశ్ శర్మ రూపొందిస్తారు. విలీన వ్యవహారం సాఫీగా జరిగేలా పర్యవేక్షిస్తారు. ఐడియా సెల్యులార్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయా మూంద్రానే విలీనసంస్థకు సీఎఫ్ఓగా వ్యవహరిస్తారు. ఐడియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రిష్ జైన్ కొత్త సంస్థకు సీఓఓగా ఉంటారు. ఐడియా ఎండీ హిమాన్షు కపానియా విలీనసంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడిగా ఉంటారు. ఆయనకు ముఖ్య బాధ్యతలు అప్పగిస్తారు. జూన్కల్లా విలీనం పూర్తవుతుందని అంచనా.
విలీన ప్రణాళిక బాధ్యత వోడాఫోన్ సీఎఫ్ఓ మనీశ్ దావర్కే
ప్రస్తుతం ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాల్లో, వివిధ వ్యాపార విభాగాలను నిర్వహిస్తున్న వారు అదేవిధంగా కొనసాగుతారు. విలీనం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చేవరకు తమ తమ కంపెనీల నిర్వహణ సామర్థ్యానికి వీరే బాధ్యత వహిస్తారని ఐడియా సెల్యులార్ తెలిపింది. వొడాఫోన్ ఇండియా సీఈఓ సునీల్ సూద్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా - పసిఫిక్ వొడాఫోన్ గ్రూప్ నాయకత్వ బృందంలో చేరతారు. వొడాఫోన్ ఇండియా సీఎఫ్ఓ మనీశ్ దావర్ విలీన ప్రక్రియ ప్రణాళిక బాధ్యత వహిస్తారు.
ఐడియా - వొడాఫోన్ విలీనం విలువ 23 బిలియన్ల డాలర్లు
గతేడాది వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ కార్యకలాపాలు విలీనం చేస్తామని ప్రకటించాయి. విలీన సంస్థ విలువ 23 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) ఉంటుందని, చందాదార్ల సంఖ్యా పరంగా 35 శాతం మార్కెట్ వాటాతో, ఆదాయపరంగానూ దేశీయంగా అగ్రస్థానం పొందుతుందని వివరించాయి.
ఎస్యూవీ, విద్యుత్ వాహనాల తయారీపైనే ఫోకస్
సరికొత్త స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (ఎస్యూవీ), చిన్న తరహా విద్యుత్ వాహనాలను తయారీ చేసేందుకు మహీంద్రా గ్రూపు, ఫోర్డ్ మోటార్ కంపెనీలు చేతులు కలిపాయి. గతేడాది కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. భారత్ సహా వర్ధమాన విపణుల్లో వినియోగదారుల కోసం కీలక వాహనాల అభివృద్ధిని వేగం చేసేందుకు ఐదు అవగాహనపూర్వక ఒప్పందాలపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి.
వేర్వేరు బ్రాండ్లతో వాహనాలను విక్రయించనున్న మహీంద్రా అండ్ ఫోర్డ్
ఒప్పందాల కింద యుటిలిటీ వాహనాల తయారీలో తమకున్న అనుభవాన్ని ఉపయోగించి మధ్య తరహా స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని అభివృద్ధి చేయనున్నామని ఫోర్డ్, మహీంద్రా ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. మహీంద్రా ప్లాంటులోనే ఎస్యూవీలను తయారు చేసినా, రెండు కంపెనీలు సొంత బ్రాండ్లపై వేర్వేరుగా విక్రయిస్తాయని పేర్కొన్నాయి.