వరల్డ్ బిగ్ డీల్: వాల్మార్ట్-ఫ్లిప్కార్ట్ మధ్య డీల్ ఒకే, ధృవీకరించిన సాఫ్ట్బ్యాంక్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత రిటైల్ సంస్థ వాల్మార్ట్ భారత ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ల మధ్య ఒప్పందం కుదిరిందని జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంకు ధ్రువీకరించింది. ఫ్లిప్కార్ట్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్బ్యాంకు అందులోని తమ వాటాను వాల్మార్ట్కు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.
వాల్మార్ట్తో ఒప్పందం
గత కొంత కాలంగా ఈ ఒప్పందంపై ఇరువర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఫ్లిప్కార్ట్లో మెజార్టీ వాటా కొనుగోలుకు వాల్మార్ట్తో ఒప్పందం కుదిరిందని సాఫ్ట్బ్యాంకు సీఈఓ మసయోషి సన్ స్పష్టం చేశారు.ఫ్లిప్కార్ట్లోని తమ 20శాతం వాటాను వాల్మార్ట్కు అమ్ముతున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోనే పెద్ద డీల్
కాగా, దీని విలువ 4బిలియన్ డాలర్లు(సుమారు రూ. 2,69,05,60,00,000) ఉంటుంది. సాఫ్ట్బ్యాంకు ఈ షేర్లను గతంలో 2.5బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ మధ్య డీల్ విలువ దాదాపు 18 నుంచి 20 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,34,53,44,000) ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ డీల్ కావడం గమనార్హం.
70శాతం వాటా కొనుగోలు
కాగా, ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ దాదాపు 70శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్లో వాల్మార్ట్తో పాటు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఉండటం గమనార్హం. ఆల్ఫాబెట్ దాదాపు 15శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఫ్లిప్కార్ట్లో సాఫ్ట్బ్యాంకుతో పాటు టైగర్ గ్లోబల్, నాస్పెర్స్, యాక్సెల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.
సచిన్, బిన్నీలకు చెరో 5శాతమే!
ఇది ఇలా ఉంటే, సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్లకు చెరో 5శాతం వాటా మాత్రమే ఉన్నట్లు సమాచారం. గతంలో అమెజాన్ ఉద్యోగులైన సచిన్, బిన్నీ 2007లో ఫ్లిప్కార్ట్ను ప్రారంభించారు. కాగా, ఈ డీల్ ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.