రూ.2,253 కోట్ల స్కామ్: హవాలా ఆపరేటర్ అరెస్ట్, ఎవరీ ఫరూక్?
ముంబై: ముంబైలో ఓ హవాలా మాఫియాలో కీలకంగా వ్యవహరించే మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూక్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుమారు 2,253 కోట్లు మనీ లాండరింగ్కు మహ్మద్ పాల్పడ్డారని ఆరోపణలతో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా విదేశాలకు కోట్లాది రూపాయాలను తరలించేందుకు ఫరూక్ 13 కంపెనీలను వాడినట్టు ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. 2015-16లో రూ.2,253 కోట్లగా ఉన్న ఈ రెమిటెన్స్, ప్రస్తుతం రూ.10వేల కోట్లను దాటిపోయినట్టు కూడా ఈడీ అంచనావేస్తోంది.
2015-16లో ఈ 13 కంపెనీలు బ్యాంకులకు నకిలీ డాక్యుమెంట్లతో రూ.2,253 కోట్ల నగదును విదేశాలకు పంపించాయని ఈడీ పేర్కొంది. అయితే ఎంట్రీలో నమోదు చేసిన అసలు బిల్లుల విలువ ఆ ఉత్పత్తుల పరిమాణం చూసుకుంటే అవి రూ.24.6 కోట్లేనని తేలింది.
ఈ 13 సంస్థలకు కూడా నకిలీ అడ్రస్లు, డమ్మీ వ్యక్తులే బోర్డు డైరెక్టర్లగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సంస్థల ద్వారా ఫరూక్ మొత్తం 135 బ్యాంకు అకౌంట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ 13 సంస్థలతో తనకేమీ సంబంధాలు లేనట్టు ఫరూక్ చెబుతున్నాడు. అతన్ని ఏప్రిల్ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
ఈ స్కాంను సీబీఐ గత మేలో వెలుగులోకి తీసుకొచ్చింది. ఫారిన్ ఎక్స్చేంజ్ స్కాండల్గా దీన్ని పేర్కొంది. ఈ స్కాంలో ఫరూక్ ప్రమేయమున్నట్టు ఈ మధ్యనే తేలింది. ఈ కేసు కోసం 149 బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సమయంలో ఫరూక్ మూడు మొబైల్ నంబర్లను ఉపయోగించినట్టు తెలిసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అతన్ని విచారించింది.