కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 850పాయింట్లు, నిఫ్టీ 260
ముంబై: మరోసారి స్టాక్ మార్కెట్ల కుప్పకూలాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74కు దగ్గరగా వెళ్తుండడం, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ఆరంభించింది. తర్వాత కూడా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 850పాయింట్ల భారీ నష్టంతో 35170 పాయింట్ల వద్ద ఉండగా.. నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో 10614 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.74 వద్ద ట్రేడవుతోంది.
భారతీ ఎయిర్టెల్, యస్ బ్యాంకు, లార్సెన్, హెచ్పీసీఎల్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి. ఐషర్ మోటార్స్, రిలయన్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.