గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు: స్టాక్ మార్కెట్కు యాసిడ్ టెస్ట్?
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ల్లో వెలువడే ఎన్నికల ఫలితాలే ఈ వారం మార్కెట్పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.. సోమవారం మార్కెట్ మొదలయ్యే సమయానికే....ఆ రెండు రాష్ట్రాల ఫలితాల ట్రెండ్ వెల్లడయ్యే అవకాశం ఉంది.ఈ ఫలితాల ప్రభావం మార్కెట్పై ఉండనుంది.
గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రెండు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు ఇన్వెష్టర్లు కూడ ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందనే ఆసక్తి పార్టీలతో పాటు ఇన్వెష్టర్లు కూడ కనబరుస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం మార్కెట్పై కన్పించే అవకాశాలు లేకపోలేదు.
ఎన్నికల ఫలితాలతో మార్కెట్పై ప్రభావం
అధికారపార్టీ గెలుపు ఓటములు, గెలుచుకోబోయే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సోమవారం మార్కెట్ గ్యాప్అప్ లేదా గ్యాప్డౌన్తో ప్రారంభంకావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అటుతర్వాత అమెరికా పన్నుల సంస్కరణలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు స్టాక్సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్ల పరిశీలన
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్కు కీలకమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు వస్తే, సమీప కాలం నుంచి మధ్య కాలానికి మార్కెట్ సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముడి చమురు ధర ప్రభావం
ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్ అమెరికా పన్ను సంస్కరణలు, ఇతర అంతర్జాతీయ అంశాలు మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సోమవారం వెలువడే ఫలితాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ల్లో బీజీపీ విజయం ఖాయమని గత శుక్రవారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, అమెరికా పన్నుల సంస్కరణలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ఈ వారం మార్కెట్పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వచ్చే వారం నుండి హలిడే మూడ్
ఫలితాల ఆధార కదలికల అనంతరం మార్కెట్లో కరెక్షన్ చోటు చేసుకునే అవకాశాలున్నాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ అంచనా వేస్తున్నారు. షేర్ల వారీ కదలికలు ఈ వారం చోటు చేసుకుంటాయని, ఇన్వెసర్లు వేచి చూసే ధోరణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వారమే మార్కెట్ చురుకుగా ఉంటుందని, వచ్చే వారం నుంచి ప్రపంచమంతా క్రిస్మస్, కొత్త ఏడాది సెలవుల సంరంభం ప్రారంభమవుతుందని వివరించారు.