పుదుచ్చేరి కాంగ్రెస్ సర్కారుకు మరో షాక్: ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీ కూటమికి ప్లస్
పాండిచ్చేరి: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మైనార్టీలో ఉండగా.. ఇప్పుడు మరో షాక్ తగిలింది. తాజాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమి నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణతోపాటు, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇప్పటి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా..
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనార్టీలో పడిపోయిన నారాయణస్వామి ప్రభుత్వానికి సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. తాజా పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టివేసినట్లయింది.
12కు పడిపోయిన కాంగ్రెస్ కూటమి బలం
పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కలిపి 18 మంది సభ్యులతో ఈ కూటమి నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్ దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ కూడా రాజీనామా చేశారు. తాజాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడంతో కూటమి బలం 12కు పడిపోయింది.
బీజేపీ కూటమి బలం పెరిగింది..
ఇది ఇలావుంటే, ఎన్నార్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, బీజేపీ 3(నామినేటెడ్)తో కూటమి బలం 14గా ఉంది. సభలో ప్రస్తుతం సభ్యుల బలం 26కు చేరింది. 14 మంది సభ్యులుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోమవారం (ఫిబ్రవరి 22న) సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష జరగనుంది.
21న నారాయణస్వామి సర్కారుకు బలపరీక్ష
బలపరీక్ష నిరూపించుకోవాలని ఇటీవల పుదుచ్చేరి ఇంఛార్జీ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, గత నాలుగేళ్ల వరకు పుదుచ్చేరి గవర్నర్గా పనిచేసిన బీజేపీ నేత కిరణ్ బేడీని రాష్ట్రపతి తొలగిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఇంఛార్జీ బాధ్యతలను అప్పగించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలో చోటు చేసుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది.