కరోనా బారినపడకముందు ఆ మహమ్మారిపై పాట పాడిన ఎస్పీ బాలు
చెన్నై: ప్రముఖ గాయకుడు కరోనా మహమ్మారి బారినపడి శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన కరోనా బారినపడే కంటే ముందు కరోనాపై ఓ తమిళ పాట పాడారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన తెచ్చేందుకు ఈ పాటను ఆయన పాడారు.
తీరనిలోటు: ఎస్పీ బాలు మృతిపై హరీశ్, కేటీఆర్, విద్యాసాగర్ రావు సహా నేతల సంతాపం
కరోనాపై విజయం సాధించేందుకు తను ఈ పాట పాడినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. సంగీత పరంగా బాగా ఆకట్టుకోకపోయినప్పటికీ.. పాటలోని విషయం ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ పాటను ప్రముఖ రచయిత వైరముత్తు రాశారు.
కరోనావైరస్ మహమ్మారి పట్ల తన అభిమానులు, మిత్రులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ బాలు కోరారు. కరోనాను నియంత్రించేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా కరోనా అంటూ సాగే ఈ పాట సుమారు 3 నిమిషాలపాటు కొనసాగుతుంది. వైరస్ చిన్నదే కానీ, మనుషుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.
నిన్నమొన్నటి వరకు కరోనా నుంచి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం స్తిమితంగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ.. నిన్న సాయంత్రం బాలు ఆరోగ్యం విషమంగా మారిందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో శుక్రవారం మధ్యాహ్నం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ తుది శ్వాస విడిచారు.
74 ఏళ్ల బాల సుబ్రహ్మణ్యం ఇప్పటికే సుమారు 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి గిన్ని బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. బాలు తన పాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. భారతదేశం వ్యాప్తంగానే గాక, ప్రపంచ వ్యాప్తంగా ఆయన పాటలకు అభిమానులున్నారు. బాలు మరణంతో దేశ సంగీత ప్రపంచం మూగబోయినట్లయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగీత లోకానికి తీరని లోటన్నారు.