చెన్నై డాక్టర్ దారుణం: ప్రేమించి పెళ్లాడిన భార్యనే..కారులో కిరాతకంగా
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. పదునైన కత్తితో గొంతు కోయడమే కాకుండా.. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెపై కారును పోనిచ్చి మరీ హతమార్చాడు. ఈ ఘటనలో అతని భార్య అక్కడికక్కడే మరణించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు అతన్ని 14 రోజులపాటు రిమాండ్ విధించింది.
ఏడాదికాలంగా ఖాళీగా..
మృతురాలి పేరు కీర్తన. వయస్సు 28 సంవత్సరాలు. కాంచీపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హెచ్ఆర్ మేనేజర్గా పని చేస్తోన్నారు. ఆరేళ్ల కిందట ఆమెకు డాక్టర్ గోకుల్ కుమార్తో వివాహమైంది. వారిది ప్రేమ వివాహం. కోయంబత్తూర్కు చెందిన గోకుల్ కుమార్.. కీర్తన స్వస్థలం చెంగల్పట్టు సమీపంలోని మధురాంతకంలో స్థిరపడ్డారు. చెన్నై సమీపంలోని పొత్తేరిలో అతను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్గా పని చేసేవాడు. లాక్డౌన్ అనంతరం అతను ఉద్యోగాన్ని మానివేశాడు. ఏడాది కాలంగా అతను ఖాళీగా ఉంటున్నాడు.
విడాకుల కోసం పట్టు..
అప్పటి నుంచి వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆరు నెలలుగా వారు వేర్వేరుగా నివసిస్తున్నారు. మూడునెలల కిందట కీర్తన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు ఇవ్వడానికి గోకుల్ కుమార్ అంగీకరించలేదు. విడాకులు ఇవ్వడం వల్ల సమాజంలో తన పరువు పోతుందంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చేవాడు. విడాకుల కోసం కీర్తన పట్టుబట్టడంతో అతని కోపం పతాక స్థాయికి చేరుకుంది. భర్తతో విడిపోయిన తరువాత కీర్తన.. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు.
ఇంటికెళ్లి ఘర్షణ..
శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్ ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. అడ్డొచ్చిన మామ మురహరిపై గోకుల్ కుమార్ కత్తితో దాడి చేశాడు. కీర్తనను విచక్షణారహితంగా పొడిచాడు. అతని నుంచి తప్పించుకోవడానికి ఆమె వీధిలోకి పరుగులు తీసినప్పటికీ.. అతను వదల్లేదు. వెంటపడి మరీ కత్తితో గొంతు కోశాడు. అక్కడితో ఆగలేదు. ఆమెను తన కారుతో తొక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కీర్తనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
యాక్సిడెంట్కు గురై.. పోలీసుల చేతికి
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు కీర్తన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గోకుల్ కుమార్ దాడిలో కత్తిపోట్లకు గురైన కీర్తన తండ్రి మురహరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి అనంతరం గోకుల్ కుమార్ కారులో తప్పించుకెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తోన్న కారు జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. మధురాంతకం టోల్గేటు వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గోకుల్ గాయపడ్డాడు. దీంతో అతడిని చెంగల్పట్టు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అనంతరం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.