చేయని తప్పుకు బలైపోయిన మహిళ.. సిబ్బంది నిర్లక్ష్యంతో హెచ్ఐవి... హైకోర్టు కీలక తీర్పు
రక్త మార్పిడిలో జరిగిన తప్పిదంతో హెచ్ఐవి బారినపడి... చేయని తప్పుకు బలైపోయిన ఓ మహిళకు సంబంధించిన కేసులో తమిళనాడు హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బాధితురాలికి ప్రతీ నెలా రూ.7500 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆమెకు రూ.25లక్షలు పరిహారంతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించింది. హెచ్ఐవి సోకడంతో బలవర్ధకమైన,పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారని... కానీ పేదరికం తన పోషణకు అడ్డంకిగా మారిందని కోర్టుకు బాధితురాలు విన్నవించింది. ఈ నేపథ్యంలో మానవతా కోణంలో స్పందించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
అసలేం జరిగింది...
తమిళనాడులోని విరుద్దునగర్ జిల్లా సత్తూర్కు చెందిన ఆ మహిళ 2018లో గర్భంతో ఉన్న సమయంలో రక్తహీనత బారినపడింది. దీంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా అక్కడి వైద్యులు ఆమెకు రక్తం ఎక్కించారు. అయితే ఆ రక్తం ఎక్కించిన కొద్దిరోజులకు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవి పాజిటివ్గా తేలడంతో అంతా షాకయ్యారు. ఆస్పత్రిలో ఆమెకు ఎక్కించిన రక్తం వల్లే ఆమె హెచ్ఐవి పాజిటివ్ బారినపడినట్లు ఆ తర్వాత తేలింది.
రక్త దానం చేసిన వ్యక్తికి హెచ్ఐవి...
మురుగన్ (పేరు మార్చాం) అనే వ్యక్తి ఇచ్చిన రక్తాన్ని ఎక్కించడంతోనే ఆమెకు హెచ్ఐవి సోకినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ మొత్తం వ్యవహారంలో సిబ్బంది తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపించింది. నిజానికి మురుగన్కు హెచ్ఐవి ఉన్న విషయం తెలియక రక్త దానం చేశాడు. ఆ రక్తాన్ని శివకాజీ జనరల్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో భద్రపరిచారు. ఆ తర్వాత కొద్దిరోజులకు మురుగన్ తాను విదేశాలకు వెళ్లే నిమిత్తమై వైద్య పరీక్షలకు వెళ్లగా అతనికి హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. దీంతో శివకాశీ జనరల్ ఆస్పత్రి సిబ్బందికి అతను సమాచారమిచ్చాడు.
సిబ్బంది నిర్లక్ష్యం...
మురుగన్ ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ... అక్కడి ల్యాబ్ టెక్నీషియన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘోరం జరిగిందన్న ఆరోపణలున్నాయి. మురుగన్ బ్లడ్కి హెచ్ఐవి పాజిటివ్ అని స్టిక్కర్ వేయాల్సింది పోయి.. దానిపై నెగటివ్ స్టిక్కర్ అలాగే ఉంచారు. దీంతో ఆ గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా రక్తం అవసరమైన సమయంలో పొరపాటున అదే రక్తాన్ని తీసుకెళ్లి ఎక్కించారు.
దీంతో చేయని తప్పుకు ఆ అమాయకురాలు బలైపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు పుట్టిన బిడ్డ మాత్రం హెచ్ఐవి బారిన పడలేదు. ప్రస్తుతం ఆమె కడు పేదరికంలో ఉండటంతో ఆమె తరుపున కొంతమంది మానవతావాదులు కోర్టును ఆశ్రయించి ఆమెకు పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. స్పందించిన కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చింది.