రక్షణశాఖలో చైనా ఏజెంట్: రాజ్నాథ్ను తప్పించే కుట్ర: చిదంబర రహస్యమేంటీ..డౌట్స్?
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు తెర తీసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద సంభవించిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కళ్లకు గంతలు కడుతోందని మండిపడుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద వాస్తవాలను సమాధి చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తోంది.
భారత భూభాగంలో చైనా సైనికులపై వాస్తవాలేంటీ?
లఢక్ సమీపంలో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చారనే విషయంపై కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తుతూ వస్తోంది. చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారని, సామాగ్రిని సైతం తరలించుకున్నారంటూ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మాటల యుద్ధానికి దిగుతున్నారు. కేంద్రం వైఖరిని తప్పు పడుతున్నారు. చైనా సైనికులు భారత భూభాగంపై తిష్టవేసినా పట్టించుకోలేదని, చైనా పేరును ఉచ్ఛరించడానికి కూడా మోడీ సాహసించట్లేదని విమర్శిస్తున్నారు.
కేంద్రం.. పడరాని పాట్లు పడుతోందంటూ..
ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి కేంద్రం పడరాని పాట్లు పడుతోందంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీనికి అనుగుణంగా రాహుల్ గాంధీ గురువారం ఓ ట్వీట్ చేశారు. వాస్తవాధీన రేఖ పరిణామాలపై ప్రధానమంత్రి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసిన కథనం క్లిప్ను ఆయన తన ట్వీట్కు జత చేశారు. మరుసటి రోజే.. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం అనేక అనుమానాలను వెలిబుచ్చారు. వాస్తవాలను దాచి పెట్టే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం తనకు తెలియకుండా నిజాలను వెల్లడిస్తోందని అన్నారు. నిజాలను ఎంతోకాలం దాచి ఉంచలేరని చెప్పారు.
Recommended Video
రక్షణశాఖలో చైనా ఏజెంట్..
రక్షణ మంత్రిత్వ శాఖలో చైనా ఏజెంట్ ఎవరో పని చేస్తున్నట్టు కనిపిస్తోందని పీ చిదంబరం అనుమానాలను వ్యక్తం చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేదా ఇంకో అధికారిని గానీ తప్పించేలా పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నాయని చెప్పారు. రాజ్నాథ్ సింగ్పై వేటు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అర్థం వచ్చేలా చిదంబరం కామెంట్స్ చేశారు. దీనిపై కొద్దిసేపటి కిందట ఆయన వరుసగా ట్వీట్లను సంధించారు. తన అనుమానాలను వ్యక్తీకరించారు. భారత భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదంటూ ఇదివరకు ప్రధానమంత్రి చేసిన ప్రకటనను కూడా తప్పు పట్టేలా ఉందని చిదంబరం చెప్పారు.
రక్షణశాఖ వెబ్సైట్లో అసలు విషయం..
రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో తాజాగా పొందుపరిచిన అంశాలన్నీ వాస్తవమే అయితే ఆ శాఖ మంత్రి లేదా ఇతర ఉన్నతాధికారులు లేదా ఎవరో ఒకరు ఉద్వాసనకు గురి కాక తప్పదని చిదంబరం అభిప్రాయపడ్డారు. రాజ్నాథ్ సింగ్ ప్రతిష్ఠను కూడా దెబ్బతీయడం ఖాయమని చెప్పారు. తన అంచనా నిజమైతే రక్షణమంత్రిత్వ శాఖలో కీలక అధికారి లేదా వ్యక్తిపై వేటు పడొచ్చని చిదంబరం చెప్పుకొచ్చారు. ఇందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలేనని చెప్పుకొచ్చారు. దీని ఫలితం- ఇదివరకు రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన కూడా తప్పేనని తేలేలా ఉందని ఆయన అన్నారు.