తమిళనాడులో థర్డ్ ఫ్రంట్ దిశగా కమల్... శరత్ కుమార్తో భేటీ... తలుపులు తెరిచే ఉంచామని కామెంట్...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాలు,పొత్తుల విషయాల్లో తలమునకలయ్యాయి. సాధారణంగా ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అన్నాడీఎంకె-డీఎంకె మధ్యే ప్రధాన పోరు నెలకొంటుంది. దివంగత దిగ్గజ నేతలు కరుణానిధి,జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకె-బీజేపీ,డీఎంకె-కాంగ్రెస్ పొత్తుతో బరిలో దిగనున్నాయి. ఈ మేరకు సీట్ల పంపకాలపై ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. మరోవైపు మక్కల్ నీది మయ్యమ్ అధినేత,నటుడు కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్పై ఫోకస్ చేశారు.
కమల్తో శరత్ కుమార్ భేటీ... థర్డ్ ఫ్రంట్పై...
తాజాగా ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్కుమార్ కమల్ హాసన్ను కలిశారు. ఈ సందర్భంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. భేటీ అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ... భావ సారుప్యత కలిగిన పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని కమల్ హాసన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కమల్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ... మంచి పని కోసం రాజీ పడేందుకు తాను సిద్దమని ప్రకటించారు. తమిళనాడు,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆశాభావం వ్యక్తం చేశారు.
కలిసొచ్చే పార్టీలకు తలుపు తెరిచే ఉంచాం : కమల్
'ఇప్పుడిప్పుడే మబ్బులు కమ్ముకుంటున్నాయి... ఇక త్వరలోనే వర్షపాతం మొదలవుతుంది...' అని కమల్ వ్యాఖ్యానించడం గమనార్హం. తమతో కలిసి నడిచేందుకు సిద్దంగా ఉన్న పార్టీలకు తలుపులు తెరిచే ఉంచినట్లు చెప్పారు. మార్చి 3న తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని... మార్చి 7న తొలి విడత అభ్యర్థుల జాబితా వెల్లడిస్తానని కమల్ హాసన్ తెలిపారు. అన్నాడీఎంకె బహిష్కృత నేత,అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అధినేత టీటీవీ దినకరన్తోనూ తాము చర్చలు జరుపుతున్నట్లు మక్కల్ నీది మయ్యం ప్రతినిధి ఒకరు వెల్లడించినట్లు కథనాలు వస్తున్నాయి.
మరిన్ని చిన్న పార్టీలతో సంప్రదింపులు...!!
కమల్ హాసన్ పార్టీ పెట్టిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కమల్ భావిస్తున్నారు. ఇందుకోసం తమతో కలిసొచ్చేవారిని కలుపుకుపోవాలని భావిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని మరికొన్ని చిన్న పార్టీలను సంప్రదించి పొత్తుపై సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసనే ఉండే అవకాశం ఉంది.
అన్నాడీఎంకె-బీజేపీ,డీఎంకె-కాంగ్రెస్ సీట్ల పంపకాలు...
మరోవైపు డీఎంకె-కాంగ్రెస్,అన్నాడీఎంకె-బీజేపీ మధ్య పొత్తుల సంప్రదింపులు జరుగుతున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 50 సీట్ల కోసం డీఎంకెను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డీఎంకె మాత్రం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీ చేసి కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు బీజేపీకి అన్నాడీఎంకె 15 సీట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం తమకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరో రెండు,మూడు రోజుల్లో ఈ సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.