మల్టీ స్టారర్ పాలిటిక్స్: ఆటో వాలా రజినీకాంత్ పార్టీతో పొత్తుపై తేల్చిసిన కమల్ హాసన్
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం.. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్యే నడిచిన ఎన్నికల పోరులో ఇంకొన్ని పక్షాలు జత కానున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికలు త్రిముఖంగా లేదా అంతకుమించే ఉండబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే లోక నాయకుడు కమల్ హాసన్.. ఎన్నికల ప్రచార బరిలో దిగారు. త్వరలోనే రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించబోతోన్నారు.
తమిళ సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు ఏలిన ఈ ఇద్దరు టాప్ హీరోలు.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మల్టీ స్టారర్ సినిమాల్లో కలిసి నటించిన కమల్ హాసన్-రజినీకాంత్ జోడీ.. రాజకీయాల్లోనూ అదే పంథాను అనుసరిస్తాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీథి మయ్యం (ఎంఎన్ఎం).. రజినీకాంత్ ప్రకటించబోతోన్న రాజకీయ పార్టీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
దీనిపై కమల్ హాసన్ ఓ క్లారిటీ ఇచ్చారు. భావ సారూప్యం, సిద్ధాంతాలు కలిస్తే.. రజినీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తనకు ఎలాంటి భేషజాలు లేవని తేల్చి చెప్పారు. సిద్ధాంతాలు కలవడమంటూ జరిగితే.. తమ రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపడినట్టవుతుందని, పార్టీ సిద్ధాంతాలను రజినీకాంత్ ప్రకటించిన తరువాతే.. తనకు ఒక అవగాహన వస్తుందని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల కిందటే ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
స్పిరిచ్యువల్ పాలిటిక్స్ను అనుసరిస్తానంటూ రజినీకాంత్ ఇదివరకే సూచనప్రాయంగా చెప్పారని, ఆ ఒక్క పదంతోనే.. ఆయన నెలకొల్పబోయే పార్టీ సిద్ధాంతాలను అంచనా వేయలేమని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుందని, రజినీకాంత్ కూడా అదే బాటను అనుసరిస్తారనే తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మతపరమైన రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. భారత్లో నివసిస్తోన్న 130 కోట్ల మంది ప్రజల్లో అన్ని మతాలవారూ ఉన్నారని గుర్తు చేశారు.