కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయండి.. మద్రాస్ హైకోర్టులో సంచలన పిటిషన్...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి,నటి తమన్నాలను అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్(జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ను నిషేధించాలని... వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని కోరారు.
Recommended Video
పిటిషనర్ ఏమంటున్నారు....
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది ఓ వ్యసనంలా తయారై యువత ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఓ యువకుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం అప్పులు చేసి... తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల తమిళనాడులో ఈ తరహా ఆత్మహత్యలు ఎక్కువైనట్లు పిటిషనర్ వెల్లడించారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కి అలవాటుపడి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని,తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువకుల సంఖ్య పెరుగుతోందన్నారు.
గ్యాంబ్లింగ్ని బ్లూ వేల్తో పోల్చిన పిటిషనర్...
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని ఆ పిటిషనర్ బ్లూ వేల్ గేమ్తో పోల్చారు. బ్లూ వేల్ లాగే గ్యాంబ్లింగ్ కూడా ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటోందన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వచ్చే మంగళవారం విచారణ జరపనుంది. ఈ పిటిషన్పై ఇప్పటికైతే కోహ్లి,తమన్నాల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ కోర్టు దీనిపై వీరిద్దరిని కౌంటర్ దాఖలు చేయమని కోరితే.. ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.
ఐపీఎల్కి సన్నద్దమవుతున్న కోహ్లి...
ప్రస్తుతం విరాట్ కోహ్లి రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం సన్నద్దమవుతున్నాడు. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు ఇప్పుడిప్పుడే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించనున్నారు.షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19న మొదలుకానున్న ఐపీఎల్ నవంబర్ 8 లేదా 10తో ముగుస్తుంది. టోర్నీకి సంబంధించిన కీలక అంశాలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోనున్నారు.