తమిళనాడులోను మహారాష్ట్ర తరహా రాజకీయం??: అన్నామలై
తమిళనాడు రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర తరహా రాజకీయం నెలకొనబోతోందని భారతీయ జనతాపార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండే లాంటి నాయకులు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందిన సంగతి తెలిసిందే. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఈ చీలిక ఎన్డీయేకు కలిసి రానుంది.
తాజాగా అన్నామలై మాట్లాడతూ మహారాష్ట్రలో ఉధ్దవ్ ఠాక్రే పై ఏక్నాథ్ షిండే చేసిన తిరుగుబాటును 'రాజధర్మం'గా అభివర్ణించారు. శివసేనకు, తమిళనాడులో డీఎంకేకు కొన్ని పోలికలున్నాయని ఉదహరించారు. బాల్థాకరే పెద్ద కుమారుడు బిందుమాధవ్ సినిమా రంగంలోకి వెళ్లారని, అలాగే కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు సినిమా రంగంలో ఉన్నారని చెప్పారు. రెండో కుమారుడు కుటుంబానికి దూరంగా ఉన్నారని, కరుణానిధి రెండోకుమారుడు అళగిరి కూడా కుటుంబానికి దూరంగా ఉన్న విషయాన్ని వివరించారు.
మూడో కుమారుడు ఉద్ధవ్ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుగుబాటు జరిగిందని, కరుణానిధి మూడో కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారని, త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నారని, ఆ తర్వాత షిండేలాంటి నేతలు పుట్టుకొస్తారని జోస్యం చెప్పారు.
అన్నామలై వ్యాఖ్యలపై డీఎంకేకు చెందిన సీనియర్ నేత ఆర్.ఎస్.భారతి స్పందించారు. ఆయన చెత్తమాటలు మాట్లాడుతున్నారని, వాటిని సీరియస్గా తీసుకోవడంలేదని, డీఎంకేలో తిరుగుబాటు వచ్చే అవకాశమే లేదని భారతి స్పష్టం చేశారు. ఏదేమైనా కానీ అన్నామలై వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు.