పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఫలితంగా- బలపరీక్షను ఎదుర్కొనబోతోంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలు మరింత బెడిసి కొట్టాయి. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో.. ఇక 12 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వం పతనం అంచుల్లో నిలిచింది.
కదలిన అమెరికా: ఏకంగా 87 సంఘాలు మద్దతు: రీగన్ హయాంలోనే బీజం
ఈ పరిణామాల మధ్య అసెంబ్లీలో విశ్వస పరీక్షను నిర్వహించడానికి ముందే- తన పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రంతా ఆయన ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తాజా రాజీనామాల అనంతరం- 26 మంది సభ్యుల బలం ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమికి ఉన్న ఎమ్మెల్యేల బలం 14.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 13. ప్రతిపక్ష ఎన్ఆర్ కాంగ్రెస్-7 ఏఐఏడీఎంకే-4, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభించినట్టయింది. ఈ పరిస్థితుల్లో ఓటమి తప్పదని భావిస్తోన్న ముఖ్యమంత్రి నారాయణ స్వామి బలపరీక్షకు మెుందు రాజీనామా చేయొచ్చనే ప్రచారం సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం.. పుదుచ్చేరి అసెంబ్లీ ఈ ఉదయం 10 గంటలకు సమావేశం కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి నారాయణ స్వామి బలపరీక్షను నిరూపించుకోవాల్సి ఉంటుందంటూ లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇదివరకే ఆదేశాలను జారీ చేశారు.