సూపర్ స్టార్ రజనీకాంత్ కు సమన్లు జారీ .. ఆ వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలన్న కమిటీ
2018లో తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన లో 13 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోవడం పై సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు అరుణ జగదీశన్ కమిటీ ఎదుట హాజరుకావాలని రజనీకాంత్ కు సమన్లు జారీ అయ్యాయి. టుటికోరిన్లోని తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీలో 2018 ఈ సంవత్సరంలో జరిగిన హింసాకాండపై దర్యాప్తులో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్కు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరారు.
వేదాంత స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని 2018లో సాగిన ఆందోళనలు
వేదాంత స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ నిరసనకారులు పోలీసులతో గొడవపడటంతో 13 మంది మరణించారు. తూత్తుకుడి లో స్టెరిలైట్ కాపర్ కర్మాగారం తో పరిసరాలు కాలుష్యం అవుతున్నాయని, నీ రు కూడా కలుషితమై స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దానిని మూసివేయాలని 2018 లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ఆందోళనలో పాల్గొన్నారు.
తూత్తుకుడి ఘటనలో 13 మంది మృతి .. రజనీ తీవ్ర వ్యాఖ్యలు
ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అనంతరం పోలీసులు కాల్పులు జరపగా 13 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో అప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు రాజకీయాలను కలిపి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ను దుర్వినియోగం చేసిందని ఈ ఘటన నేపధ్యంలో రజనీకాంత్ ఆరోపించారు.
ఆందోళన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని రజనీకాంత్ వ్యాఖ్యలు
భద్రతా బలగాలు క్రూరంగా ప్రవర్తించడం నేను ఖండిస్తున్నా అని పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ రజనీకాంత్ పోలీసుల తీరు క్రూరంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ ఆందోళన వెనక సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఒక మహిళా జ్యుడిషియల్ ప్యానెల్ ఇప్పుడు రజనీకాంత్ను పిలిచి, "సంఘ విద్రోహ అంశాలు" నిరసనలోకి చొరబడిందని ఆయన చేసిన వ్యాఖ్యపై విచారణ జరపనున్నారు.
అరుణ జగదీశన్ కమిటీ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు
రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఇంతకుముందు రజనీకాంత్ ను పిలిపించారు, కాని అప్పుడు బిజీ షెడ్యూల్ కారణంగా రజనీకాంత్ మినహాయింపు కోరారు. ఇప్పుడు మరోమారు ఆయనకు సమన్లు జారీ చేశారు.ఆ సమయంలో ఆ ఘటనపై తీవ్రంగా స్పందించిన రజనీ కాంత్ ప్రజలకు యూనిఫాంలో హాని చేసే వారిని తాను అంగీకరించనని, పోలీసుల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా మండిపడ్డారు. ప్రజలు బయటకు వెళ్లి ప్రతిదానికీ నిరసనలు ప్రారంభిస్తే, తమిళనాడు మొత్తం స్మశానవాటిక అవుతుంది అని నటుడు అన్నారు. రజినీకాంత్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసినందున తూత్తుకుడి ఘటన విచారిస్తున్న కమిటీ ఇప్పుడు రజినీకాంత్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కమిటీ ఎదుట హాజరుకావాలని రజనీకాంత్ కు సమన్లు జారీ చేసింది .