మహిళలకు కీలక హామీ: రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రతినెలా నగదు: మేనిఫోస్టో ఛాంపియన్
చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు తమిళనాడులో చక్కర్లు కొడుతోన్నారు. ఎన్నికల వేళ..ఆయా పార్టీల నేతలు ఓటర్లపై వరాల జల్లును కురిపిస్తోన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఎడతెగని హామీలు ఇస్తోన్నారు. అధికారంలోకి రావడానికి తమవంతు ప్రయత్నాలను చేస్తోన్నారు. ప్రతిపక్ష డీఎంకే.. మహిళా ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకుంది. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక్క రోజు ముందు ఆయన ఈ హామీని ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే.. రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికి 1000 రూపాయల నగదును ఇస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తిరుచ్చిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసం అనుసరించే వ్యూహాలను ప్రకటించారు. వచ్చే పదేళ్ల కాలానికి సంబంధించిన అభివృద్ధి వ్యూహాలను ఆయన ప్రజలకు వివరించారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే.. ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నీటి వనరులు, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం వంటి రంగాలను మెరుగుపరుస్తామని అన్నారు.
సామాజిక న్యాయంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికీ ప్రతినెలా 1000 రూపాయలను ఇస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా దాన్ని రూపొందించామని స్టాలిన్ వెల్లడించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. 2006 నాటి ఎన్నికల సందర్భంగా కరుణానిధి విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో తరహాలో ఇది ఛాంపియన్గా నిలుస్తుందని అన్నారు.
తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి. డీఎంకే కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య నడుస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా.. ఇందులో బీజేపీకి 20 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. కన్యాకుమారి లోక్సభ సీటును కూడా కేటాయించింది. తన మిత్రపక్షం కాంగ్రెస్కు 25 సీట్లను ఆఫర్ చేసింది డీఎంకే. కన్యాకుమారి లోక్సభను కూడా కేటాయించింది. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి.