సినీ ఫక్కీలో తమిళనాడులో దోపిడీ ... 15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల కంటైనర్ చోరీ
దోపిడీ దొంగలు రూటు మార్చారు. చిన్నా, చితకా దొంగతనాలు గిట్టుబాటు కాక భారీ భారీ దొంగతనాలనే చేసేస్తున్నారు . సరికొత్త పంథాలో దొంగతనాలకు తెగబడ్డారు. హాలీవుడ్ స్టైల్లో, సినీఫక్కీలో జరుగుతున్న దొంగతనాలు రోడ్ల మీద పెద్దపెద్ద వాహనాలకు కూడా సేఫ్టీ లేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల నడిరోడ్డుపై కంటైనర్ల నుండి మొబైల్ ఫోన్ల దొంగతనాలు జరుగుతుండటం ఆందోళనకరంగా మారాయి . తాజాగా తమిళనాడులో జరిగిన ఒక దోపిడీ పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది .
వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ పై ప్రయాణం ... 2200కిమీ సైకిల్ తొక్కుతూ ఒక వృద్ధురాలి సాహసం
డ్రైవర్ ,క్లీనర్ లను చితకబాది కంటైనర్ చోరీ చేసిన దోపిడీ దొంగలు
మొబైల్ ఫోన్లు దోపిడీకి ఆరితేరిన కేటుగాళ్లు రంగంలోకి దిగారు. కంటైనర్ లకు కంటైనర్ లనే మాయం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి జిల్లాలో జాతీయ రహదారిపై ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్ దోపిడీ చేశారు కేటుగాళ్లు. డ్రైవర్ ,క్లీనర్ లను చితకబాది కంటైనర్ నుండి దింపేసి ఏకంగా కంటైనర్ తీసుకొని పరారయ్యారు. కృష్ణగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన అక్కడ ఉండి చూస్తున్న వారిని షాక్ కు గురి చేసింది.
15 కోట్ల రూపాయల విలువైన మొబైల్స్ దొంగతనం
క్రిష్ణగిరి సమీపంలోని మెలుమలై గ్రామం వద్ద ఈ చోరీ జరిగినట్లుగా తెలుస్తుంది. చెన్నై, ముంబై హైవే పైన కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ నుండి ఎమ్ఐ మొబైల్స్ ని తీసుకు వెళుతున్న కంటైనర్ పై పంజా విసిరిన దోపిడీ దొంగలు పదిహేను కోట్ల రూపాయల విలువైన మొబైల్స్ ను తీసుకు వెళ్లారు. మొబైల్ తయారీ కంపెనీల నుండి గోడౌన్ లకు చేరే మార్గ మధ్యలో దొంగలు విరుచుకుపడ్డారు. మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడ్డారు . ఈ భారీ చోరీలో మొత్తం 1440 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి .
Recommended Video
మొబైల్స్ లోడ్ ఖాళీ చేసి కంటైనర్ వదిలి వెళ్ళిన దొంగలు .. పోలీసుల గాలింపు
దోపిడి దొంగల చేతిలో గాయాలపాలైన డ్రైవర్, క్లీనర్ ప్రస్తుతం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రిష్ణగిరి సమీపంలోని అలగపావి గ్రామం వద్ద అందులో ఉన్న మొబైల్స్ లోడ్ ను ఖాళీ చేసిన దుండగులు ఖాళీ కంటైనర్ ను మాత్రమే వదిలివెళ్లారు. జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో జరిగిన దోపిడీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడి గాని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఆ నేరాలకు ఈ దోపిడీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.