అభయ హత్యలో కొత్త కోణం: వర్జీనిటీ..సెక్సువల్ యాక్టివిటీ: కాజ్ ఆఫ్ డెత్: క్రైమ్ థ్రిల్లర్
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్యోదంతంలో దోషులకు ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. 28 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు విచారణకు పుల్స్టాప్ పడింది. ఈ కేసులో ఫాస్టర్, సిస్టర్ ఇద్దరూ దోషులేనని మంగళవారమే నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. తాజాగా వారికి శిక్షను ఖరారు చేసింది. వారిద్దరికీ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు 229 పేజీల తీర్పును న్యాయమూర్తి జస్టిస్ కే సునీల్ కుమార్ చదివి వినిపించారు.
తొలి ముద్దాయిగా ఫాదర్..
ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్ను తొలి ముద్దాయిగా సీబీఐ న్యాయస్థానం గుర్తించింది. సిస్టర్ సెఫీని మూడో దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొన్న క్యాథలిక్ ప్రీస్ట్ జోస్ పుథురుక్కయిళ్ను నిర్దోషిగా గుర్తించింది. 2018లోనే ఆయనను నిర్దోషిగా తేల్చింది. థామస్ కొట్టూర్, సెఫీలకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తన తీర్పు పాఠంలో పొందుపరిచిన దర్యాప్తు అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తోన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడి పేరు వెల్లడించే వేళ..రైతు దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
గొడ్డలితో నరికి చంపినట్లు..
సిస్టర్ అభయను థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ గొడ్డలితో నరికి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తల వెనుక భాగం, మధ్యలో గొడ్డలితో నరికినట్లు డాక్టర్లు సాక్ష్యాధారాలను అందజేసినట్లు న్యాయమూర్తి తన తీర్పులో పొందుపరిచారు. తల పగలడం, తీవ్ర రక్తస్రావం కావడం వల్లే ఆమె మరణించినట్లు డాక్టర్ ఇచ్చిన నివేదికలు స్పష్టం చేశాయి. ఉద్దేశపూరకంగానే ఆమెను హత్య చేశారని తేలింది. ఇంతకుముందు దోషులు వాదించినట్లు బావిలో పడి ఆత్మహత్య చేసుకోలేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
బావిలో పడిన సమయంలో తల పగిలినట్టు..
సిస్టర్ అభయ.. పొరపాటున బావిలోకి జారిపడిందని, ఆ సమయంలోనే ఆమె తలకు గాయమైనట్లు దోషులు థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ న్యాయస్థానం ముందు చేసిన వాదనలు అర్థరహితమని విచారణలో తేలింది. గొడ్డలితో నరికి ఆనవాళ్లు కనిపించకుండా ఉండటానికే వారు మృతదేహాన్ని బావిలో తలకిందులుగా పడేశారు. అనంతరం దాన్ని అక్కడే కప్పి ఉంచే ప్రయత్నం చేశారు. తమ ప్రయత్నం విఫలం కావడంతో అభయ ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.
కన్యనేనని నిరూపించుకోవడానికి సర్జరీ..
ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ మధ్య అక్రమ సంబంధం ఉండేది, వారిద్దరూ సెక్స్లో పాల్గొన్న దృశ్యాన్ని సిస్టర్ అభయ చూడటం వల్లే ఆమెను హత్య చేశారు. హత్యానంతరం పోలీసుల విచారణ సందర్భంగా కన్యత్వ పరీక్ష (వర్జీనిటి)ని పరిశీలించే అవకాశం ఉందని భావించిన సిస్టర్ సెఫీ హైమెనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నట్లు తేలింది. సిస్టర్ సెఫీ, ఫాదర్ థామస్ కొట్టూర్ తరచూ సెక్సువల్ యాక్టివీటీలో పాల్గొనే వారని విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు నిర్ధారించారు.. మూడోకంటికి తెలియకుండా వారు అక్రమ సంబంధాన్ని కొనసాగించారని, అది బయట పడటం వల్లే అభయను హతమార్చారని నివేదిక ఇచ్చారు.
దొంగ కీలక సాక్షిగా
ఈ కేసులో అడక్క రాజు అనే ఓ దొంగ ఇచ్చిన సాక్ష్యం అత్యంత కీలకంగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- సామాజిక కార్యకర్త కారల్కోడై వేణుగోపాల్ ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి పెద్ద ఎత్తున ఉద్యమించారు. సిస్టర్ అభయ హత్యోదంతాన్ని ఆత్మహత్యగా నిర్ధారించి, సీఐడీ పోలీసులు కేసును మూసివేసినప్పటికీ.. దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. అనంతరం ఈ హత్యోదంతాన్ని అప్పటి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.