ఎస్పీ బాలు చివరి పాట.. రజినీకాంత్ కోసం: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం: మూవీ ఏంటో తెలుసా?
అమరావతి: అమర గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక మనకు లేరనే విషయం తెలియడంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు మూగబోయాయి. ప్రేక్షకులు శోకసముద్రంలో మునిగిపోయారు. 74 సంవత్సరాల ఎస్పీ బాలును కరోనా వైరస్ పొట్టనబెట్టుకుంది. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన ఆయన కిందటి నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఒకసారి ఆయన కోలుకున్నప్పటికీ..అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది.
మనకు తెలియని ఎస్పీ బాలు రికార్డు: 12 గంటల్లో ఏకధాటిగా 21 పాటలు: ఎవరి కోసం?..ఏ భాషలో?
అవిశ్రాంతం.. ఆ గళం..
శుక్రవారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ఎస్పీ బాలు కన్నుమూసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ వార్త భారత చలనచిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో విషాదఛాయలు అలముకున్నాయి. సంగీతానికి ఎల్లలు లేవనే విషయాన్ని ఆయన రుజువు చేశారు. 16 భాషల్లో పాటలు పాడారు. 40 వేలకు ఆయన సినీ గీతాలను ఆలపించారు. ఆయన గళానికి విరామం, విశ్రాంతి అనేదే లేదు. ఎక్కడా బ్రేక్ పడలేదు. ఈ మధ్యకాలంలో కూడా తెలుగు, తమిళ భాషల్లో ఆయన పాటలను పాడారు.
రజినీకాంత్ కోసం చివరి పాట..
తమిళంలో ఎస్పీ బాలు పాడిన చివరి పాట.. రజినీకాంత్ కోసం. దక్షిణాది సూపర్స్టార్ రజినీకాంత్ తాజా మూవీ అన్నాత్తి. తమిళ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ మీద ఉంది. చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది పొంగల్కు ఈ సినిమా విడుదల అయ్యేలా యూనిట్ ప్లాన్ చేస్తోంది. శివ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, ప్రకాశ్ రాజ్, రోబో శంకర్, సూరి, సతీష్ ఇందులో నటిస్తున్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కుతోంది. లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డీ ఇమ్మాన్ సంగీత దర్శకుడు.
ఖజానాలా దాచుకుంటా..
అన్లాక్ 4లో భాగంగా సినిమా షూటింగులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. త్వరలోనే సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. అన్నాత్తీ మూవీలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఆయన కరోనా వైరస్ బారిన పడటానికి కొద్దిరోజుల ముందు ఈ పాటను రికార్డ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ డీ ఇమ్మాన్ ఈ పాటను రికార్డ్ చేశారు. ఎస్పీ బాలు చివరి పాట అదే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన దర్శకత్వంలో పాట పాడటం అద్భుతమని ఇమ్మాన్ అన్నారు. ఆయన చివరి పాటను ఓ ట్రెజరీలా తాను జీవితాంతం దాచుకుంటానని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్లో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు.
తెలుగులో పలాసలో..
తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట.. పలాస 1978 మూవీ కోసం. ఈ సినిమాలో ‘ఓ సొగసరి..ప్రియలాహిరి.. తొలకరి వలపుల సిరి..1 అనే పాటను ఎస్పీ బాలు ఆలపించారు. లక్ష్మీ భూపాల రాసిన లిరిక్ ఇది. రఘు కుంచె సంగీత దర్శకుడు. ఎస్పీ బాలు, సోషల్ మీడియా సెన్సేషన్ బేబి కలిసి ఈ పాటను పాడారు.